దేనికోసం?: సీఎంపై శృతిమించిన పొగడ్తలు, కేసీఆర్కు చంద్రబాబే భిక్ష
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 67వ పుట్టినరోజుని విజయవాడలో చేసుకున్న సంగతి తెలిసిందే. తన పుట్టినరోజు సందర్భంగా బెజవాడలోని కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. టీడీపీ అధినేత అయిన చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలకు హాజరైన టీడీపీ నేతలు వారి మాటల్లో కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. త్వరలో చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణను చేపట్టనున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా రేసులో మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు హాజరై ఆయనపై తెగ ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా గాలి మాట్లాడుతూ 2050 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబే కొనసాగుతారని అన్నారు. అదృష్టం కలిసొస్తే చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగున్న కేసీఆర్కు చంద్రబాబే రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు.
వైసీపీ సేవ్ డెమోక్రసీ అనడం విడ్డూరంగా ఉందని గాలి ఎద్దేవా చేశారు. రాజ్భవన్ దగ్గర ప్రభుత్వాన్ని కూల్చుతానన్నది జగన్ కాదా? అని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్రెడ్డి టీఆర్ఎస్ను చీల్చలేదా? అని ఆయన నిలదీశారు. అప్పుడు సేవ్ డెమోక్రసీ గుర్తుకు రాలేదా? అంటూ వ్యాఖ్యానించారు.
అనంతరం మాట్లాడిన తెలంగాణ టీడీపీ ఎంపీ మల్లారెడ్డి చంద్రబాబు నాయుడిని కాబోయే ప్రధాన మంత్రిగా అభివర్ణించారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ కార్యకర్తగా పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని బాబు నాయకత్వాన్ని కొనియాడారు.
ఇక ఏపీలో ఐటీ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించిన ర్యాంకుల్లో తక్కువ మార్కులు తెచ్చుకున్న పల్లె రఘనాథరెడ్డి సైతం చంద్రబాబును పొగిడేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు తప్ప, ఎంతో కీలక శాఖ అయిన ఐటీ శాఖను అభివృద్ధి దిశగా ప్రయత్నాలు చేయడం లేదని రాజకీయ విశ్లేషకుల విమర్శ.
తెలంగాణలో ఐటీ మంత్రిగా కేటీఆర్ అద్భుతంగా రాణిస్తుంటే, ఏపీలో ఐటీ మంత్రిగా పల్లె రఘనాథ రెడ్డి ఐటీ గురించి తనకేమీ తెలియదన్నట్టుగా ఉంటున్నారు. ఐటీ మంత్రి అంటే నిత్యం అటు సాంకేతిక నిపుణులతో పాటు, సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ అందుబాటులో ఉండాలి.
ఉదాహరణకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో దూసుకెళ్తున్నారు. ఇటీవల తమ కాలనీలో చెత్త ఎత్తివేయడం లేదంటూ ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదుకు ఆయన వెంటనే స్పందించి అందరి మన్ననలను అందుకున్నాడు. అదే ఏపీ ఐటీ మంత్రి ట్విట్టర్ హ్యాండ్లర్లో చివరి ట్వీట్ సెప్టెంబర్ 17, 2014న చేశారు.
ఆయనకు ట్విట్టర్లో కేవలం 75 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. తమ అధినేత చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడంలో ముందుంటే నేతలు రాష్ట్రాభివృద్ధిలో మాత్రం తమ స్పీడ్ను చూపించడం లేదని విమర్శ కూడా వస్తోంది.
సమయం, సందర్భం లేకుండా చంద్రబాబుపై ప్రశంసలు కురిపించే మరో మంత్రి రావెల కిశోర్ బాబు. చంద్రబాబును పొగిడేందుకే ఈయన సమావేశాలు ఏర్పాటు చేస్తారనే టాక్ కూడా ఉంది. అందరికంటే ముందే చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఈయన కూడా ఉన్నారు.