షాకింగ్: 'హోదా గురించి సరే, తెలంగాణ పట్టదా, ఆంధ్రా గవర్నర్లా'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు బుధవారం నాడు గవర్నర్ నరసింహన్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ ఆంధ్రా గవర్నర్గా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఏపీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన గవర్నర్ నరసింహన్ ఏపీకి ప్యాకేజీ, ప్రత్యేక హోదాలపై సమాచారం అందించారని, తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాత్రం ప్రధానికి ఎందుకు వివరించలేదని ప్రశ్నించారు.
గవర్నర్కు ఏపీలోని సమస్యలు తప్ప, తెలంగాణలో నెలకొన్న సమస్యలు కనిపించడం లేదా అని నిలదీశారు. మల్లన్న సాగర్ రైతుల ఇబ్బందులు, రైతుల ఆత్మహత్యలు, పోలీసుల లాఠీఛార్జీ, మహిళలపై బలప్రయోగం చేయడం వంటి విషయాలను కేంద్రం దృష్టికి గవర్నర్ ఎందుకు తీసుకెళ్లలేదన్నారు.

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న గవర్నర్ నరసింహన్ను తెలంగాణ గవర్నర్ పదవి నుంచి తొలగించి, వేరే వ్యక్తిని నియమించాలని డిమాండ్ చేశారు. నరసింహన్ గవర్నర్గా ఉన్నన్ని రోజులు తెలంగాణకు నిధులు రావని ఆరోపించారు. ఏం అభివృద్ధి చేశారని మంత్రి కేటీఆర్ బెస్ట్ స్టేట్ అవార్డు తీసుకున్నారని ప్రశ్నించారు. దీని గురించి కేటీఆర్కు లేఖ రాస్తే సమాధానం లేదన్నారు.
కేసీఆర్-చంద్రబాబు మధ్య అవగాహన: మల్లు రవి
అధికార తెరాస ఆరోపిస్తున్నట్లు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా కలిసి పని చేయలేదన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పైన ప్రజల కోసం విపక్షాలన్నీ కలిశాయన్నారు.
కేసీఆర్ కొత్త జిల్లాల పేరుతో ప్రజల ఆత్మగౌరవంతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల విషయంలోను ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రాణహిత, చేవెళ్ల అంచనా రూ.80వేల కోట్లకు పైగా పెంచారన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పైన ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు.












Click it and Unblock the Notifications