ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డికి జాతీయ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డిని క్యాపిటల్ ఫౌండేషన్ జస్టిస్ కుల్దీప్సింగ్ నేషనల్ అవార్డు వరించింది. పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డును ప్రకటించారు.
ఆగస్టు 21న జరుగనున్న కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్సింగ్ చేతులమీదుగా పురుషోత్తం రెడ్డి ఈ అవార్డును స్వీకరించనున్నారు.
ఏడుగురు రాష్ట్ర టీచర్లకు జాతీయ అవార్డులు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను కేంద్రం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. వీరిలో నలుగురు ప్రాథమిక, ముగ్గురు సెకండరీ స్కూళ్ల ఉపాధ్యాయులున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేటకు చెందిన ప్రాథమిక పాఠశాల టీచర్ కుమారి నాగమ్మ, కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన కాలకొండ శశికళ, వరంగల్ జిల్లాకు చెందిన పరమేశ్ కుమార్ రఘు నారాయణ, ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన దామల్ల వెంకటేశంలు అవార్డుకు ఎంపికయ్యారు.
కాగా, సెకండరీ స్కూల్ టీచర్ల విభాగంలో వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన మహ్మద్ రాజ్మహ్మద్, నిజామాబాద్ జిల్లా భీంగల్కు చెందిన సి ప్రకాశ్, కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన కె సంపత్కుమార్లు ఎంపికయ్యారు.