పిల్లల ముందే లైంగిక దాడి: నయీంపై ఫర్హానా, గోవాలోనే నదీం హత్య
హైదరాబాద్: షాద్నగర్ ఎన్ కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు చేపట్టిన విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. పోలీసు కస్టడీలో నయీమ్ అనుచరురాలు ఫర్హానా సంచలన విషయాలు బయటపెట్టింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన తాను తన భర్త చనిపోవడంతో నయీమ్ ఇంట్లో వంట మనిషిగా చేరానని తెలిపింది.
అయితే, నయీమ్ తనను తరచూ వేధింపులు గురిచేసేవాడని తెలిపింది. అతని అరాచకాలు భరించలేకపోయానని చెప్పింది. పిల్లల ఎదుటే లైంగిక దాడులకు పాల్పడేవాడని, తన పిల్లలు మాట వినడంలేదని పచ్చిమిర్చి రసం తాగించేవాడని ఆమె చెప్పినట్టు సిట్ పేర్కొంది. నయీమ్ కొట్టిన దెబ్బలకు తన పిల్లలు నడువలేని స్థితిలో ఉన్నారని ఆమె విచారణలో పేర్కొన్నట్టు సిట్ అధికారి ఒకరు తెలిపారు.
నయీమ్ నెలలో 20 రోజులపాటు గోవా బీచ్లోని ఇంట్లో ఎంజాయ్ చేసేవాడని, గోవా వెళ్లేటప్పుడు అమ్మాయిలను కూడా వెంట తీసుకెళ్ళేవాడని ఫర్హానా విచారణలో తెలిపింది. గోవాలోనే నదీంను కిరాతకంగా హత్య చేశాడని, ఆయన చేసిన హత్యలకు తానే ప్రత్యక్ష సాక్షినని ఫర్హానా సిట్ అధికారుల విచారణలో పేర్కొంది.

గోవా, అనంతపురం, ఒంగోలు, రాయ్చూర్, చత్తీస్గఢ్లలో ఫ్లాట్లు, ప్లాట్లు, భూములు ఉన్నాయని, తరచూ తనను అక్కడికి తీసుకెళ్లేవాడని ఫర్హానా పేర్కొన్నట్టు తెలుస్తోంది. నయీమ్ అరాచకాలను అతని అమ్మ, అత్త, సోదరి ప్రోత్సహించేవారని, వీళ్ల ఎదుటే నయీమ్ అరాచకాలకు పాల్పడేవాడని విచారణలో వెల్లడైంది.
కాగా, షాద్నగర్లోని వీరి ఇంట్లోనే నస్రీన్ను కూడా హత్య చేశారని విచారణలో తేలింది. ఏడాది క్రితం నయీమ్ వేధింపులకు తాళలేక ఫమి, సమి అనే యువతులు కనిపించకుండాపోయారని వారేమయ్యారో తనకు తెలియదని ఫర్హానా పేర్కొన్నట్టు తెలిసింది.
పోలీసులపై తొలి వేటు: నయీమ్ కేసులో కాదని ఎస్పీ
గ్యాంగ్స్టర్ నయీమ్ అక్రమ వ్యవహారాల కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై తొలివేటు పడింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సిఐ ఉపేంద్ర, చెంగోముల్ ఎస్ఐ శేఖర్లు శనివారం సస్పెండ్ అయ్యారు. నయీమ్ బాధితులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వస్తే బాధితులను వేధించారనే ఆరోపణలతో వారిని సిట్ ఐజి నాగిరెడ్డి సస్పెండ్ చేశారు.
కాగా, నయీమ్ కేసులో ఇప్పటి వరకు సిట్ అధికారులు 40 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నరుూం బాధితులు ఎవరు ఫిర్యాదు చేసినా తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు సిట్ ఐజి నాగిరెడ్డి సూచించారు. ఈ మేరకు సిట్ కార్యాలయంలో కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశామని, బాధితులు ఎవరైనా నేరుగా కాల్సెంటర్కు ఫిర్యాదు చేయవచ్చని ఐజి తెలిపారు.
ఇది ఇలా ఉండగా, సిఐ ఉపేందర్, ఎస్ఐ శేఖర్లను సస్పెండ్ చేస్తూ ఐజి శనివారం ఉత్తర్వులు జారీ చేశారని రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్కుమార్ వెల్లడించారు. అయితే ఈ సస్పెన్షన్ నయీమ్ కేసులో కాదని ఆయన మీడియాకు వెల్లడించారు. చన్గొముల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం చేయడమే కాకుండా, తప్పుగా విచారణ చేశారని తెలిపారు.
నయీమ్ కేసుకు సంబంధించి కేసులేమైనా ఉన్నాయేమోననే కోణంలో విచారణ చేశామని ఎలాంటి కేసులు లేవని తేలిందని ఎస్పీ చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో నరుూం కేసులన్నీ సైబరాబాద్ పరిధికి సంబంధించినవేనని పేర్కొన్నారు. పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో నరుూం కేసులేమీ లేవని చెప్పారు.












Click it and Unblock the Notifications