లేడీ గెటప్లో హైదరాబాద్ టు రాయ్పూర్: నయీం లీలలు ఇంతింతకాదయా!
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నార్సింగ్ పోలీసుల కస్టడీలో నయీం అనుచరులైన మహమ్మద్ అబ్దుల్ ఫహీమ్, ఆయన భార్య షాజీదా షాహీన్ల విచారణలో వెల్లడించిన విషయాలతో పోలీసులు అవాక్కయ్యారు.
మారువేషాల్లో విమానాల్లో ప్రయాణించే నయీం విమానాశ్రయాల నుంచి నిమిషాల వ్యవధిలో ఇంటికి చేరుకునేందుకు ముందుగానే మహీంద్రా ఎస్యూవీ లాంటి వాహనాలను విమానాశ్రయాల్లోనే పార్క్ చేసేవాడంట. అంతేకాదు నయీం ఎక్కువగా చత్తీస్గడ్లోని రాయ్పూర్, హైదరాబాద్లోని శంషాబాద్కు ఎక్కువగా విమానాల్లో ప్రయాణించేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
నెలలో కనీసం నాలుగైదు సార్లు చత్తీస్గడ్లోని రాయ్పూర్కు ప్రయాణించేవాడని తెలిసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సెటిల్మెంట్లను చత్తీస్గఢ్లో ఏర్పాటు చేసుకున్న డెన్లో సెటిల్ చేసేందుకు వెళుతుండేవాడని నయీం అనుచరులు విచారణలో వెల్లడించారు.
ల్యాండ్ సెటిల్ మెంట్ బాధితులను రాయపూర్కు రప్పించుకుని చక్కటి రుచులతో కూడిన విందు భోజనంతో పాటు మందు పార్టీ ఇచ్చేవాడు. పార్టీ అనంతరం వారిని బెదిరించి సంతకాలు చేయించేవాడని తెలిసింది. నయీం ఎన్ కౌంటర్ తర్వాత రాజేంద్రనగర్ మండలం నెక్నాంపూర్ గ్రామంలోని అల్కాపూరి టౌన్షిప్లోని అతని ఇంట్లో లభించి కిట్ మేకప్లు, విగ్లను ఉపయోగించే విమానాల్లో ప్రయాణాలు చేసేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి చత్తీస్గఢ్లోని రాయ్పూర్ వెళ్లేందుకు ఎప్పుడూ లేడీ గెటప్లోనే వెళ్లేవాడని తెలిసింది. లేడీ గెటప్ వేసేందుకు ఎంతో ఆసక్తిని చూపించే నయీం శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాయ్ పూర్ విమానాశ్రయానికి చేరుకోగానే అక్కడ పార్క్ చేసిన ఎస్యూవీ వాహనంలోకి ఎక్కి చీర విప్పేసి టీ షర్ట్, ప్యాంట్ వేసుకుని ఇంటికి వెళ్లేవాడంట.
ఆ తర్వాత అక్కడ సెటిల్ మెంట్లు చేసేవాడు. నిజానికి నయీం తన జీవితంలో చేసిన ఈ సీన్లు అచ్చం సినిమాల్లో మాత్రమే మనం చూస్తుంటాం. ఇదిలా ఉంటే నార్సింగ్ పోలీసుల విచారణలో నయీంతో కలిసి దారుణమైన నేరాలు చేశామని అతడి అల్లుడు ఫహీమ్, ఆయన భార్య షాజీదా షాహీన్లు ఒప్పుకున్నారని తెలిసింది.
నదీమ్, నస్రీమ్ హత్య కేసుల్లో తాము సహకరించామని, వారి మృతదేహాలను నగర శివారు ప్రాంతాలైన షాద్నగర్, మంచిరేవుల ప్రాంతాల్లో కాల్చివేసినట్లు అంగీకరించారు. ఎంతో మందిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నయీం అక్క కూతురు షాజీదా షాహీన్ పేరిట రాజమండ్రి, విజయవాడ, బాపట్ల, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో ఇళ్లను కొనుగోలు చేశాడని విచారణలో చెప్పారు.
అదే విధంగా శంషాబాద్, రాయ్పూర్ ఎయిర్పోర్టులలో పార్క్ చేసి ఉన్న మహీంద్రా ఎస్యూవీ వెహికల్స్ను కూడా చూపించేందుకు అంగీకరించారు. నల్గొండలో బొలెరోను మసూద్కు ఇచ్చామని, చత్తీస్గఢ్లోని రాయ్పూర్లో అల్టో కారు, టాటా సఫారీ, హ్యందాయ్ ఇయాన్ కారులు ఉన్నాయని వారు తెలిపారు.
కాగా, వీరి కస్టడీ ముగియడంతో వాహనాలు స్వాధీనం చేసుకునేంత సమయం లేకపోవడంతో నిందితులను మరోసారి కస్టడీకి కోరుతూ రాజేంద్రనగర్లోని ఉప్పర్పల్లి కోర్టులో నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో వాహనాలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు.
వీరిద్దరిని పది రోజుల పాటు కస్టడీకివ్వాలన్న పిటిషన్ విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. ఇదే కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న ఫర్హానా, ఆఫ్సాల ఏడు రోజుల పోలీసు కస్టడీకివ్వాలని నార్సింగ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ కూడా బుధవారానికే వాయిదా పడింది.