తలసాని ఏమైనా రాజీనామా చేశారా: నాయని సంచలన వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎందుకు అని, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమైనా రాజీనామా చేశారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గురువారం తెలంగాణ భవన్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి జగదీశ్వర్ రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి తలసాని టిడిపి తరఫున గెలవడం, ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి మంత్రి అయిన నేపథ్యంలో... దీనిపై విలేకరులు అడిగారు. రాజీనామా వ్యవహారం ఇంకా స్పీకర్ వద్ద పెండింగులో ఉండటంతో దీనిపై టిడిపి... రాష్ట్రపతి, గవర్నర్లకు ఫిర్యాదు చేసింది.
హైకోర్టులో కేసు వేసింది కూడా. తలసాని రాజీనామా పైన ఎప్పటికప్పుడు చర్చ సాగుతోంది. తలసాని రాజీనామా ఎందుకు చేయలేదని గతంలో టిడిపితో పాటు విపక్ష సభ్యులు ప్రశ్నించారు. దానికి తలసాని.. తాను రాజీనామా చేశానని వివరణ ఇచ్చారు. ఇప్పుడు తలసాని... ఆయన ఏమైనా రాజీనామా చేశారా అన్నారు. ఇది చర్చనీయాంశమైంది.
మేడారానికి రూ.102 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు నిధులు కేటాయించారు. పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వచ్చే తొలి జాతరకు తెలంగాణ తొలి సర్కార్ నాలుగు నెలల ముందుగానే రూ.102 కోట్లను విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా నుంచి ప్రతిపాదనలు వెళ్లగానే తొలిదశగా రూ.101.86 కోట్లను విడుదల చేసింది. దీంతో పనుల వేగం పుంజుకోవడమే కాకుండా భక్తకోటికి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
తొలిదశలో అధికారులు 34 పేజీల ప్రతిపాదనల వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. ఇందులో ఆర్ అండ్ బీ డి పార్ట్మెంట్కు అత్యధికంగా పర్యాటకశా ఖకు అత్యల్పంగా పరిపాలనా అనుమతులు లభించడం విశేషం.