సోనియాకు మొక్కాల్సిందే: మంత్రి నాయిని, దక్షిణ టీకి అన్యాయమంటూ సబితా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి మొక్కాలని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. నిరుద్యోగం వల్లే దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాపడ్డారు.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు రెండేళ్లలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని బండారి శ్రీనివాస్ టెక్నికల్ క్యాంపస్లో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా ఆడిటోరియంలోని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూల మాల వేసి ఆయన నివాళులు అర్పించారు. ఆ తర్వాత విద్యార్థులకు పట్టాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఉద్యోగాల కోసమని రెండేళ్లలో సమస్య పరిష్కరించనున్నట్లు చెప్పారు.
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉత్తర తెలంగాణకు ఇచ్చిన ప్రాధాన్యం దక్షిణ తెలంగాణ ఇవ్వడం లేదని మాజీ హోం మంత్రి, కాంగ్రెసు నేత సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రిని అన్ని జిల్లాలను సమానంగా చూడాలని, కానీ ఇప్పుడు వివక్ష కనిపిస్తోందని ఆమె అన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా మంచి నీటి అవసరాలు తీరాలంటే ప్రాణహిత-చేవెళ్ల ఒక్కటే మార్గమని, ఈ ప్రాజెక్టును యధాతథంగా అమలుపర్చాలని అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డం పెట్టుకొని ప్రాణహిత-చేవెళ్ల రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎ
లాంటి నీటి ఆధారం లేని రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయవద్దని సూచించారు. భూములు అమ్ముకోవడానికి పనికొచ్చిన జిల్లా.. తాగు నీటికి ఎందుకు నోచుకోలేకపోతోందో ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు.