ఎన్డీయే కూటమి vs విపక్ష కూటమి.. ఫాం హౌస్ లో కేసీఆర్; కింకర్తవ్యం?
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి చెక్ పెట్టడం కోసం ఏకమైన ప్రతిపక్ష కూటమికి దూరంగా సీఎం కేసీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసింది బిజెపిని గద్దె దించడంకోసం అని చెప్పిన కేసీఆర్ దేశ రాజకీయాలలో చక్రం తిప్పడానికి తమతో పాటు కలిసొచ్చే పార్టీలను ఆహ్వానించారు. కెసిఆర్ కు మద్దతుగా ఎన్నికలలో కలిసి పనిచేసే పార్టీలు ఏవి అన్నవి ఇప్పటివరకు కనిపించలేదు. ఇక తాజా విపక్షాల భేటీతో ఫుల్ క్లారిటీ వచ్చింది.
ప్రతిపక్ష కూటమి సమావేశానికి కెసిఆర్ తో సన్నిహితంగా ఉంటున్న అనేక మంది కీలక నేతలు కూడా హాజరు కావడంతో ప్రస్తుతం కెసిఆర్ డైలమాలో పడ్డారు. ఇక తాను జాతీయ రాజకీయాలలో ఒంటరి పోరాటం చెయ్యాల్సిందేనా అన్న ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

గత ఐదు రోజులుగా ఫామ్ హౌస్ లోనే మకాం వేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి? 2024లో లోక్సభ ఎన్నికలకు ఏవిధంగా ముందుకు వెళ్లాలి? అన్న దానిపైన కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఒకపక్క నిన్న విపక్ష కూటమి సమావేశం, ఎన్డీయే కూటమి సమావేశం,తో కేసీఆర్ సంగతి ఏమిటి అన్నది అందరిలోనూ ఆసక్తికర చర్చ.
కేంద్రంలోని బీజేపీతో బలంగా తలపడతానని చెప్పిన కేసీఆర్ ఇలా అయితే ఒంటరిగా ఎలా తలపడతాడు అన్నది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. సుమారు రెండున్నర నెలల తర్వాత మళ్ళీ కేసీఆర్ తన ఫాం హౌస్ లో ఐదు రోజులపాటు అక్కడే మకాం వేయటం వేయడం ఇదే తొలిసారి. తెలంగాణా సెక్రటేరియట్ నిర్మాణం తర్వాత కేసీఆర్ ఫాం హౌస్ కు పెద్దగా వెళ్ళలేదు.
ఇక ఇప్పుడు 5 రోజులుగా ఫామ్ హౌస్ లో ఉన్న కెసిఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. గతంలో కేసీఆర్ ఫాం హౌస్ కు వెళితే అవసరం మేరకు మంత్రులను పిలిచి అక్కడ మంతనాలు జరిపేవారు. కానీ ఆయన ఇప్పుడు ఎవరికీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? అన్నది ఆసక్తిగా మారింది.

తెలంగాణాలో వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నారని కొందరు భావిస్తుంటే, జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టి వ్యూహాలు రచిస్తున్నారని కొందరు మాట్లాడుకుంటున్నారు. అయితే కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలని సంకల్పంతో ఉన్న సీఎం కేసీఆర్ కింకర్తవ్యం ఏమిటి అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తిగానే ఉంది.












Click it and Unblock the Notifications