అప్పుడే ఎండలు భగభగ... సూర్యుడికి ఎందుకో ఇంత పగ
సూర్యభగవానుడు అప్పుడే తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఫిబ్రవరి చివర, మార్చి తొలి పక్షంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావలసి ఉండగా, అప్పుడే ఎండలు మండిపోతున్నాయి.
హైదరాబాద్: చలికాలం పూర్తయి, వేసవికాలంలో ప్రవేశిస్తున్న సమయమిది. కానీ పరిస్థతి అలా లేదు. సూర్యభగవానుడు అప్పుడే తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఫిబ్రవరి చివర, మార్చి తొలి పక్షంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావలసి ఉండగా, అప్పుడే ఎండలు మండిపోతున్నాయి.
వేసవి కాలం మరో నాలుగు నెలలపాటు ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పగటిపూట భయంకరమైన ఎండలు ఉంటాయని అంచనా. ఈ సంవత్సరం జూన్ మధ్య భాగం వరకు కూడా ఎండలు ఉధృతంగానే ఉండొచ్చని వాతావరణ శాఖ భావిస్తోంది.
సాధారణం కన్నా ఈసారి ఎక్కువే..
వేసవిలో సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రత కన్నా ఏ ఏడాది ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ అధికంగా ఉండవచ్చని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు. అయితే వాతావరణ పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతుందని, తమ శాఖ ఈ అంశంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుందని ఆయనే చెప్పారు.
ఎన్డిఎంఎ సూచనలు..
ఈ వేసవికాలానికి సంబంధించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డిఎంఎ) కూడా ఇప్పటికే తెలంగాణతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాథమిక నివేదికలను పంపించింది. ప్రతీయేటా వేసవి కాలంలో వడగాలుల ఎంతోమంది అనారోగ్యానికి గురికావడం, మరణించడం జరుగుతోంది. గతంతో పోలిస్తే ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, వడగాల్పులు కూడా ఉధృతంగా ఉంటాయని ఎన్డిఎంఎ హెచ్చరిస్తోంది.
ఆ సమయంలో బయటికెళ్లొద్దు..
ప్రధానంగా రైతుకూలీలు, ఇతర కూలీలు ఎండల్లో ఎక్కువగా పనిచేయడం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశాలుంటాయని ఎన్డిఎంఎ భావిస్తోంది. పగటి వేళ 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగొద్దని సూచిస్తోంది. మరీ ముఖ్యంగా 12 గంటల నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్లకపోవడమే మంచిదని హెచ్చరిస్తోంది.
చలివేంద్రాల ఏర్పాటు తప్పనిసరి..
ఎండాకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డిఎంఎ సమగ్ర నివేదికలను మార్చి రెండోవారం వరకు అన్ని రాష్ట్రాలకు పంపిస్తుందని ఎన్డిఎంఎ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఒకవేళ ఎండల్లో పనిచేయాల్సి వచ్చినా, బయట తిరగాల్సి వచ్చినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని... బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే కూడళ్లలో ప్రజల అవసరాల కోసం తాగునీటిని అందించే ఏర్పాట్లు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
కూలి పనులు ఉదయం, సాయంత్రాల్లోనే..
జాతీయ ఉపాధి హామీ పథకం ప్రధానంగా ఎండాకాలంలో కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించినందువల్ల ఈ కార్యక్రమం కింద పనులు ఉదయం, సాయంత్రం మాత్రమే జరిగేట్లు చర్యలు తీసుకోవాలని ఎన్డిఎంఎ సూచించింది.
తెలంగాణలోనూ...
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా వేసవి కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ముందస్తు చర్యలు చేపట్టింది. మనుషులతో పాటు, పశుపక్ష్యాదులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ తాగునీటి శాఖ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తాగునీటి అంశంపై పక్కా ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. తాగునీటి శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, మున్సిపల్ వ్యవహారాలు, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, విద్యుత్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.