మహా కూటమిలో చర్చల పరంపర..! పీక్స్ కు చేరుకున్న మంతనాలు..!!
హైదరాబాద్ : మహాకూటమిలో చర్చలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సీట్ల సర్దుబాటు కొలిక్కిరాక కూటమి నేతలు తలలు పట్టుకునే పరిస్థితికి చేరుకుంది. సీట్ల కేటాయింపు మరో రెండుమూడు రోజుల్లో కొలిక్కి రాకపోతే స్వతంత్య్రంగా అభ్యర్థులను ప్రకటించుకుంటామని సీపీఐ హెచ్చరికలు జారీ చేస్తోంది. దీంతో కూటమిలో వాడి వేడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే గోల్కొండ హోటల్ వయా పార్క్ హయత్ చుట్టూ తిరుగుతున్న మహాకూటమి చర్చలకు ఈ అమావాస్య తర్వాత ఒక రూపం వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.
మహాకూటమిలో చర్చోప చర్చలు..! కూటమి వ్యవహారం పై కన్నెర్ర చేస్తున్న సీపిఐ..!!
తెలంగాణలో టీఆర్ఎస్ ను ఢీకొనేందుకు ఏర్పడిన కూటమిలో సీట్ల సర్దుబాటు అంశం ఎంతకీ కొలిక్కి రాలేదు. దీంతో నేతల మధ్య భేదాభిప్రాయాలు అంతకంతకూ పెరుగుతున్నాయని తెలుస్తోంది. దీనికితోడు కాంగ్రెస్ నేతల తీరు ఈ ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లవుతున్నదనే అపోహలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఏకపక్షంగా సీట్ల పంపకాలు ఉంటాయేమోనన్న భావన సిపిఐ, తెలంగాణ జనసమితి నేతల్లో కలుగుతుందని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోతే అభ్యర్థులను ప్రకటించుకుంటామని సీపిఐ కూటమి నేతలకు సున్నిత హెచ్చరికలు జారీ చేయడం కొసమెరుపు.
ఇంకా ఎంత కాలం సాగదీత..! త్వరగా తేల్చాలంటున్న నాయకులు..!!
కాంగ్రెస్ తాను 95 నుంచి 96 సీట్లలో పోటీచేస్తున్నట్టు ప్రకటించడం, అభ్యర్థులు పోటీచేసే నియోజకవర్గాల పేర్లను చూచాయిగా ప్రకటించడంతో కూటమిలోని పార్టీలైన టీడీపీ, సిపిఐ, టిజెఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 95 నియోజకవర్గాల్లో పోటీచేస్తే తమ పరిస్థితి ఏమికావాలని వాపోతున్నారట. దీంతో తామనుకున్న విధంగా సీట్లు రాకపోతే సొంత కార్యాచరణ కు దిగుతామని వారు హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. చివరికి సిపిఐ కూడా వేచి చూడబోమని చెప్పే ప్రయత్నం చేస్తోంది.
కూటమిలో కొలిక్కి రాని సీపిఐ, జనసమితి సీట్ల పంపకాలు..!
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ఏర్పాటుకు సిద్దమయ్యామని, అయితే కాంగ్రెస్ పార్టీ తీరు తమకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందని సిపిఐ నేతలు వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. సీట్ల సంఖ్యను తగ్గించి కాంగ్రెస్ పార్టీ చెప్పడం తగదని సీపీఐ నేతలు అంటున్నారు. కూటమిలో ఉంటున్న కాంగ్రెస్ తీరు ఇలాగే కొనసాగితే కూటమి నుంచి వైదొలుగుతామని వారు హెచ్చరిస్తున్నారన్న వార్తలు గుప్పు మంటున్నాయి. అలాగే తమ పార్టీలోని నేతలంతా కలిసి చర్చించిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. కూటమిలో భాగస్వామ్య పార్టీల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సీట్ల సర్దుబాటు ఉండాలని వారంటున్నారు.
ఇప్పుడు సీట్లు తక్కువైనా బాదపడొద్దు..! రేపు ప్రభుత్వం ఏర్పడ్డాక ఆదరిస్తామంటున్న కాంగ్రెస్..!
అలాగే కామన్ ఎజెండాతో ముందుకు వెళ్లాలని, గౌరవప్రదమైన ఒప్పందం ఉండాలని కోరుకున్నామని చెబుతున్నారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ తీరు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉండటం వారికి రుచించడం లేదని తెలుస్తోంది. తాము సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తుండగా, కాంగ్రెస్ నేతలు అసంబద్ధ లీకేజీలతో గందరగోళం సష్టిస్తున్నారని సిపిఐ మండిపడుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ 95 సీట్లలో, టిడిపి 14 స్థానాల్లో పోటీ చేస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్న నేపథ్యంలో సిపిఐ, టిజెఎస్కు కలిపి 10 సీట్లు మాత్రమే మిగులుతాయి. దీంతో ఆయా అసంతృప్త పార్టీల నేతలంతా ఏంచేస్తారనే అంశం పై ఉత్కంఠ నెలకొంది.