వారికి షాక్, 'కొత్త'కు ఛాన్స్: నేతలకు చెక్ చెప్పేందుకు కొత్త జిల్లాలా లేక..?
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల సంబరం ముగిసింది. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా పాత జిల్లాలలో చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు నామమాత్రంగా మిగిలిపోయారు. చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది. జానారెడ్డి నుంచి మొదలు చాలామంది సీనియర్ నేతలు ఇప్పుడు కొత్త జిల్లాలతో చక్రం తిప్పే పరిస్థితిని కోల్పోయారు.
రాష్ట్రస్థాయి నాయకులుగా పేరొంది, తమ సొంత జిల్లాల్లో తిరుగులేని ఆధిపత్యం సాధించిన అనేక మంది నాయకుల పరిధులు కొత్త జిల్లాల ఏర్పాటుతో కుంచించుకుపోయాయి. జిల్లా స్థాయిలో వీరు తిప్పే చక్రం పరిధి తగ్గింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త నేతలు వస్తున్నారు.
అయితే, జిల్లా విషయాన్ని పక్కన పెట్టి.. నా నియోజకవర్గం మాత్రం మారదు అనుకున్న నాయకులకు బాధ తప్పలేదు. చాలామంది నియోజకవర్గాలు ఒకటికి మించి జిల్లాల్లో విస్తరించాయి. పలువురి నాయకుల సొంత నియోజకవర్గాలూ వేర్వేరు జిల్లాల్లో కలిశాయి.
కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల బడా నాయకుల పరిధులు, పరిమితులు తగ్గిపోయాయి. కొత్తతరం జిల్లా స్థాయి నాయకత్వం పుట్టుకు వచ్చేందుకు అవకాశం ఏర్పడిందని అంటున్నారు. ఆయా నేతల ప్రస్తుత రాజకీయ ప్రభావాన్ని, భవిష్యత్ రాజకీయాన్నీ మార్చేస్తుందని అంటున్నారు. అధికార పార్టీ నుంచి విపక్షాల దాకా అన్ని పార్టీల పైన ఈ ప్రభావం ఉంది.
మంత్రి కేటీఆర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆయన మొన్నటిదాకా కరీంనగర్ జిల్లా మంత్రి. ఇప్పుడో. కేవలం సిరిసిల్ల జిల్లా మంత్రి మాత్రమే. కాగా, కొందరు నేతలకు చెక్ చెప్పేందుకు వీలుగా పక్కా రాజకీయ వ్యూహంతోనే కొత్త జిల్లాల పరిధులు గీశారా లేక కొత్త జిల్లాలు వచ్చినప్పుడు ఇదంతా సహజంగానే జరిగే పరిణామాలేనా అనే చర్చ సాగుతోంది.
మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి డీకే అరుణ, రేవంత రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, చిన్నారెడ్డి తదితరులు రాష్ట్రస్థాయి నాయకులుగా పేరొందారు. ఇప్పుడు వీరందరికీ సొంత జిల్లా సమస్యలు వచ్చిపడ్డాయి. నాగం నాగర్ కర్నూలు జిల్లాకు పరిమితం కానుండగా, చిన్నారెడ్డి వనపర్తి జిల్లాతో సరిపెట్టుకుంటారు.
రేవంత రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మండలాలు మహబూబ్నగర్, నాగర్ కర్నూలు మధ్య విడిపోయాయి. ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లి మాత్రం నాగర్ కర్నూలు జిల్లాలో కలిసిపోయింది. సీనియర్ మంత్రిగా జూపల్లి కృష్ణారావుకు మహబూబ్నగర్ జిల్లాలో ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు ఆ స్థానం లక్ష్మారెడ్డికి దక్కుతుంది.
జూపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలోని మూడు మండలాలు వనపర్తి జిల్లాలోకి, 4 మండలాలు నాగర్ కర్నూలు జిల్లాలోకి వెళ్లాయి. డీకే అరుణ, జూపల్లి వేర్వేరు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించనుండడంతో వారి మధ్య గొడవలు సమసినట్లే అంటన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం జిల్లాకు పరిమితం కానుండగా, జలగం వెంకట్రావు కొత్తగూడెం జిల్లాలో ఆధిపత్యం చలాయించనున్నారు. మల్లు భట్టి విక్రమార్క, టీడీపీ నేత వెంకట వీరయ్య ఖమ్మం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించనున్నారు. దాంతో, జిల్లాస్థాయి నాయకులుగా ఎదగడానికి కొత్తగూడెం జిల్లాలో పలువురికి అవకాశాలేర్పడ్డాయి.
మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేటకే పరిమితం అవుతున్నారు. టీడీపీ నేత దేవేందర్ గౌడ్ మేడ్చల్ జిల్లాకే పరిమితం. సబితా ఇంద్రారెడ్డి పుట్టినిల్లు వికారాబాద్ జిల్లాలో ఉండగా మెట్టినిల్లు రంగారెడ్డి జిల్లాలో ఉంది. దీంతో ఆమె కూడా రెండు జిల్లాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి మహేందర్ రెడ్డి తీరు అదే విధంగా ఉంది. ఆయన తన స్వగ్రామం ఉన్న షాబాద్ మండలం రంగారెడ్డిలో కలిసింది.
ఇక, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గాల పలు జిల్లాల్లో కలిశాయి. హుస్నాబాద్పై చాడ వెంకట్ రెడ్డి ఆశలు పెట్టుకోగా, ఈ నియోజకవర్గంలోని 4 మండలాలు సిద్దిపేట, హన్మకొండలో జిల్లాల్లో కలుస్తున్నాయి. శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని కూడా రెండు జిల్లాల్లోకి చీలిపోయింది.
నిజామాబాద్ ఎంపీ కవితకు కామారెడ్డి జిల్లాతో ఏమాత్రం సంబంధముండదు. కాంగ్రెస్ నేత నేత షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లాకే పరిమితం కానున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహా మిగిలిన నాయకులు నిర్మల్ జిల్లాకే పరిమితం కానున్నారు. మంత్రి జోగు రామన్న ఇప్పుడు ఆదిలాబాద్కు పరిమితం కానున్నారు.