తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం
ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం కోదండరాం.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. 2009 డిసెంబర్ 23న నాటి హోంమంత్రి చిదంబరం.. తెలంగాణ ప్రక్రియ నుంచి వెనక్కు వెళుతున్నామని ప్రకటించడంతో ఏర్పాటైన రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ)కి చైర్మన్గా నియమితులయ్యారు.
నాటి నుంచి మిలియన్ మార్చ్, సాగర హారం, సకల జనుల సమ్మె తదితర కార్యక్రమాలతో సబ్బండ తెలంగాణ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా జేఏసీని కొనసాగిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ ముందుకు వెళుతున్నారు.
ఆయన చేపట్టే కార్యక్రమాలకు కాంగ్రెస్ సహా విపక్షాల మద్దతు లభిస్తున్నది. విద్యార్థి, యువజనులకూ ఆయన మాటంటే వేదవాక్కు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్ల ో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రైతులు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందంటూ విపక్షాలతో కలిసి ఆయన తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.