కొత్త రేషన్ కార్డుల జారీ ఆ సర్వే ఆధారంగానే
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డు అందుతుందన్నారు. కుల సర్వే సమాచారం ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు వస్తాయని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2 కోట్ల 90 లక్షల రేషన్ కార్డులున్నాయని మంత్రి తెలిపారు.

గత పదేళ్లుగా రేషన్ కార్డులు లేకుండా, కొత్తగా పెళ్లైన వారికి, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి జనవరి 26 నుంచి రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే నమ్మొద్దని, ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక అధికారులను అడిగి తెలుసుకోవాలని ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఇక, రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఇందుర్తి మండలం కూడా ఏర్పడుతుందని మంత్రి పొన్నం తెలిపారు. కాగా, జనవరి 26 నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తులు వేగంగా జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications