చంపింది భర్తే..: పెళ్లయిన 4రోజులకే హత్య, 10నెలల తర్వాత వెలుగులోకి!
పెళ్లయిన నాలుగు రోజులకే వివాహిత హత్యకు గురైన ఘటనలో పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని చేధించారు. హత్యకు జరిగిన 10నెలలకు దీని మిస్టరీ వీడటం గమనార్హం. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందువల్లే ఆమెను కడతేర్చినట్టు నిర్దారించారు. హత్యకు అతని తండ్రి కూడా సహకరించినట్టు తేల్చారు. తాజా విచారణలో నిందితులు ఇద్దరు నేరం అంగీకరించారు.
అసలేం జరిగింది?:
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన బొల్లం రాజేశ్వరి(20) షాద్నగర్లోని శ్రీనిధి స్పిన్ టేక్స్ ఫ్యాక్టరీలో కొంతకాలంగా పనిచేస్తోంది. ఫ్యాక్టరీ వాళ్లు ఇచ్చిన గదిలోనే నివాసముంటోంది. ఇదే ఫ్యాక్టరీలో పనిచేసే అచ్చిగారి ప్రవీణ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కారు డ్రైవర్ అయిన ప్రవీణ్ స్వగ్రామం నందిగామ మండల ఈదులపల్లి.
ప్రేమ వ్యవహారం:
ప్రవీణ్-రాజేశ్వరి మధ్య కొంతకాలం ప్రేమ వ్యవహారం కొనసాగింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే ప్రవీణ్ మాత్రం ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. కానీ రాజేశ్వరి తల్లి లక్ష్మమ్మ బలవంతం మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2017, జూన్ నెలలో శంషాబాద్ లోని ఓ ఆలయంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత లక్ష్మమ్మ ఖమ్మం వెళ్లిపోయింది.
ఇష్టం లేని పెళ్లి..:
ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ప్రవీణ్.. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. దీంతో తండ్రి జంగయ్యతో కలిసి ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాడు. పెళ్లయిన నాలుగు రోజులకు.. ఇద్దరు ఆమెపై దాడి చేశారు. ఆ దెబ్బలకు రాజేశ్వరి స్పృహ కోల్పోయింది. దీంతో అదే అదునుగా భావించి టవల్ తో ఆమె మెడను బిగించి హత్య చేశారు. అదే రోజు రాత్రి ఆమె మృతదేహాన్ని మొత్కులగూడ శివారులోని పాడుపడ్డ బావిలో పడేశారు. నెల రోజుల తర్వాత గానీ ఈ హత్య ఘటన వెలుగుచూడలేదు.
ఇలా బయటపడింది:
ఇటీవల రాజేశ్వరి తల్లి లక్ష్మమ్మ కూతురిని చూసేందుకని ఖమ్మం నుంచి ఈదులపల్లికి వచ్చింది. అయితే అక్కడ ఇంటికి తాళం వేసి కనిపించడంతో స్థానికులను ఆరా తీసింది. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రవీణ్, జంగయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. రాజేశ్వరిని తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు.