పవన్ రె"ఢీ"-కాషాయానికి గులాబీ ముల్లు : ఏపీలోనూ ప్రభావం -బీజేపీ లో చర్చ-తేల్చిందేంటి..!!
బీజేపీ-జనసేన మధ్య అధికారిక పొత్తు కొనసాగుతోంది. కానీ, అనధికారికంగా మాత్రం ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేనట్లుగానే కనిపిస్తోంది. ఏడాదిన్నార క్రితం ఢిల్లీ కేంద్రంగా కలిసి ప్రయాణం చేయాలని రెండు పార్టీల అధ్యక్షులు కలిసి ఆరెస్సెస్ నేతల సమక్షంలో నిర్ణయించారు. ఏపీలోని అమరావతిలో రెండు పార్టీల ముఖ్యనేతలు కామన్ అజెండా ప్రకటించారు. ఇప్పటి వరకు అది అమలు కాలేదు. ఏపీలో తిరుపతి ఎన్నికల సమయంలో మినహా..మిగిలిన అన్ని అంశాల్లోనూ ఎవరికి వారే అన్నట్లుగా సాగుతున్నారు.
బీజేపీ నేతల తీరుపై పవన్ ఆగ్రహం..
ఇక, రెండు పార్టీల పొత్తు నేపథ్యంలో తెలంగాణలోనూ ఇరు పార్టీల నేతలు కలిసి కొద్ది రోజులు పని చేసారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి..పోటీ చేయద్దని, తమకు మద్దతివ్వాలని కోరారు. ఫలితంగా పవన్ వెంటనే పోటీలో నిలబడాలనే నిర్ణయంతో పాటుగా అప్పటికే ప్రకటించాలని సిద్దం చేసిన జాబితాను ఉప సంహరించుకున్నారు. కానీ, తరువాత తెలంగాణ బీజేపీ నేతల పైన పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
పవన్ ను పట్టించుకోని బీజేపీ నేతలు..
పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు తమకు జాతీయ బీజేపీ నేతలు గౌరవం ఇస్తున్నా..తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం మర్యాదగా వ్యవహరించటం లేదంటూ ఫైర్ అయ్యారు. దీని కారణంగానే తాము బీజేపీ నిలబెట్టిన ఎమ్మెల్సీ అభ్యర్ధులకు కాకుండా.. పీవీ నర్సింహారావు కుమార్తెకు మద్దతిస్తామని ప్రకటించారు. ఆ తరువాత తెలంగాణ నేతలతో పవన్ కు పెద్దగా సంబంధాలు కొనసాగ లేదు. ఖమ్మం-వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా ప్రభావం చూపలేదు. అదే విధంగా తిరుపతి ఎన్నికల తరువాత ఏపీలోనూ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చింది.
ఉప ఎన్నికలోనూ పవన్ ను దూరంగానే..
పవన్ ఎక్కువ సమయం సినిమాలకే కేటాయిస్తున్నారు. ఈ సమయంలోనే హుజారాబాద్ బై పోల్ లో మిత్ర పక్షంగా ఉన్న జనసేనతో ఎలా వ్యవహరించాలనే చర్చ అంతర్గతంగా సాగినట్లు విశ్వసనీయ సమాచారం. పవన్ ను ప్రచారానికి పిలవటం ద్వారా ప్రయోజనం కలుగుతుందా అనే చర్చ సాగినట్లుగా తెలుస్తోంది. అయితే, ఒక వైపు సీఎం కేసీఆర్ నీటి వివాదాల పేరుతో సెంటిమెంట్ అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్న సమయంలో...పవన్ ప్రచారం చేస్తే రాజకీయంగా నష్టం జరగుతుందనే అభిప్రాయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
జనసేన నేతల నుంచి ఒత్తిడి..
ఇందులో భాగంగానే...ఇప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్న జనసేనతో చర్చలు జరపలేదని సమాచారం. బీజేపీలో చేరిన తరువాత ఆ పార్టీ నేతలు అందరినీ కలిసిని ఈటల జనసేన అధినేతను మాత్రం కలవలేదు. బీజేపీ నేతలు జనసేనను పట్టించుకోవటం లేదనే భావన కింది స్థాయి పవన్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో..ఇక, పవన్ సైతం తమకు గౌరవం ఇవ్వని చోట ఎక్కువ కాలం కలిసి ఉండలేమనే భావనకు వచ్చరాని పార్టీ నేతలు చెబుతున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్దికి మద్దతిస్తారా..
ఇందులో భాగంగా... అసవరమైతే టీఆర్ఎస్ నేతలు సంప్రదిస్తే ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్దికి మద్దతివ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకపోవటంతో, తొందర పడి నిర్ణయాలు తీసుకోకుండా..మరి కొద్ది రోజుల తరువాత అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. అయితే, గులాబీ పార్టీకి మద్దతివ్వటం ద్వారా బీజేపీతో ఇక దూరం అవ్వటానికే పవన్ ఆలోచిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఏపీలో సైతం జనసేన కేడర్ బీజేపీతో పొత్తు పైన సుముఖంగా లేరు.
Recommended Video
పవన్ నిర్ణయం..ఏపీ పైనా ప్రభావం..
తిరుపతి ఉప ఎన్నికల విషయంలో అభ్యర్ధి -పోటీ విషయంలోనూ పవన్ పైన ఒత్తిడి తెచ్చినా...ఆయన పార్టీ నేతలను సముదాయించారు. అయితే, ఇప్పుడు పవన్ ప్రచారం సాగుతున్నట్లుగా టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తే... ఆ ప్రభావం ఏపీ రాజకీయాల పైన ఏ మేర ఉంటుందనే కోణంలోనూ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. దీంతో..హుజూరాబాద్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు వేచి చూసి నిర్ణయం తీసుకొనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ టాపిక్ రెండు పార్టీల్లోనూ హాట్ టాపిక్ గా మారుతోంది.