కాంగ్రెస్ లోకి డీఎస్ రీ ఎంట్రీ..!! రేవంత్ ఆహ్వానం-అంగీకారం : ఎంపీ పదవికి రాజీనామా చేసి..!!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. సీనియర్ పొలిటీషియన్.. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుుడిగా ఉన్న డీ శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. టీపీపీ చీఫ్ రేవంత్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. కాంగ్రెస్ లోకి తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే, తాను మర్యాద పూర్వకంగానే డీఎస్ తో భేటి అయ్యానని...డీఎస్ ను పరామర్శించేందుకే వచ్చానని రేవంత్ చెప్పుకొచ్చారు. డీఎస్ సైతం ఇదే విషయాన్ని చెప్పారు. అయితే, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు బలమైన ప్రత్యర్దిగా పోటీ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు.
డీఎస్ తో రేవంత్ సుదీర్ఘ మంతనాలు
దీంతో.. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పని చేసి పార్టీ మారిన వారిని తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ లో సుదీర్ఘ ప్రస్తానం ఉన్న డీఎస్ ప్రస్తుతం టీఆర్ఎస్ లో యాక్టివ్ గా లేరు. దీంతో..తొలుత డీఎస్ ను ఒప్పించగలిగితే..ఇతర నేతలు సైతం ఆలోచన చేసే అవకాశం ఉంటుందని రేవంత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా డీఎస్ను రేవంత్రెడ్డి ఆహ్వానించారు. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని ఆహ్వానం
2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2009లో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినా డీఎస్ ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం హోదాలో కేసీఆర్ స్వయంగా డీఎస్ ఇంటికెళ్లి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపించారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ టికెట్పై నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించారు.
సంక్రాంతి తరువాత డీఎస్ రీ ఎంట్రీకి ఛాన్స్
డీఎస్ మరో కుమారుడు సంజయ్ కాంగ్రెస్ లో ఉన్నారు. అయితే, కేసీఆర్ మాట కోసం పార్టీలో చేరిన తనకు ఆ తర్వాత తనకు తగిన గౌరవం ఇవ్వలేదని, వివిధ ఆరోపణలు చేసి అవమానించారని, డీఎస్ కొంతకాలంగా టీఆర్ఎస్కు దూరంగానే ఉంటున్నారు. రేవంత్ తో మంతనాలతో డీఎస్ సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఎంపీ పదవికి, టీఆర్ఎస్కు రాజీనామా చేయనున్నారని సమాచారం. అయితే, టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం సైతం డీఎస్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.
Recommended Video
టీఆర్ఎస్ - డీఎస్ మధ్య పెరిగిన దూరం
ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా..అప్పుడప్పుడు కీలక వ్యాఖ్యలు చేస్తున్న..వేచి చూసే ధోరణితోనే వ్యవహరిస్తోంది. అయితే, ఇప్పుడు రేవంత్ స్వయంగా డీఎస్ తో చర్చలు చేయటం..ఆయన తిరిగి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకత్వం స్పందిస్తుందా..లేక, డీఎస్ తన నిర్ణయం ప్రకటించే వరకూ వేచి చూస్తుందా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.
డీఎస్ కాంగ్రెస్ లో చేరకుండా..అడ్డుకొనేందుకు ఏమైనా తమ నుంచి ప్రతిపాదనలు టీఆర్ఎస్ నేతలు చేస్తారా.. లేదా అనేది వేచి చూడాల్సిందే. అయితే, డీఎస్ తో మొదలు పెట్టిన రేవంత్ టీఆర్ఎస్.. బీజేపీల్లో చేరిన మాజీ కాంగ్రెస్ నేతలనూ తిరిగి రప్పించేందుకు రేవంత్ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.