తెలంగాణలో ఏడువేల కంటే దిగువకు: తగ్గుముఖం పట్టిన కొత్త కేసులు: ఆ మూడు జిల్లాల్లో
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోంది. కొత్త కేసులు వెయ్యి లోపే నమోదవుతున్నాయి. కరోనా మరణాలు సైతం పరిమితంగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య అయిదుకు మించట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేలకు దిగువగా నమోదు అయ్యాయి. కరోనా వైరస్ విజృంభణకు తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అడ్డుకట్ట వేయగలిగింది. కొత్త కేసుల నమోదులో వేగం మందగించడం ఊరటనిస్తోంది.
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 617 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు. 635 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,82,347కు చేరుకుంది. ఇందులో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 2,74,260 మంది ఉన్నారు. 1,518 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కేసులు ఏడు వేలకు దిగువగా నమోదు అయ్యాయి. తాజా బులెటిన్ ప్రకారం.. 6,569 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో 4,400 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 103 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్కు ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో తీవ్రత కొనసాగుతోంది. 50కి పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆదిలాబాద్-11, భద్రాద్రి కొత్తగూడెం-30, జగిత్యాల-18, జనగామ-8, జయశంకర్ భూపాలపల్లి-7, జోగుళాంబ గద్వాల-4, కామారెడ్డి-3, కరీంనగర్-41, ఖమ్మం-32, కొమరంభీమ్ ఆసిఫాబాద్-5, మహబూబ్నగర్-7, మహబూబాబాద్-10, మంచిర్యాల-16, మెదక్-4, మేడ్చల్ మల్కాజ్గిరి-52, ములుగు-8, నాగర్ కర్నూల్-12, నల్లగొండ-15, నారాయణ్పేట్-1 నిర్మల్-5, నిజామాబాద్-12, పెద్దపల్లి-20, రాజన్న సిరిసిల్ల-11, రంగారెడ్డి-51, సంగారెడ్డి-21, సిద్ధిపేట్-17, సూర్యాపేట్-22, వికారాబాాద్-6, వనపర్తి-6, వరంగల్ రూరల్-10, వరంగల్ అర్బన్-41, యాదాద్రి భువనగిరి-8 కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 45,227 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. దీనితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 65,20,993గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1,75,201 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.