24 గంటల్లో అల్పపీడనం.. తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం.. వాతావరణ శాఖ వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ముసురులా ఉంది. గత రెండు రోజుల నుంచి చల్లగానే ఉంది. ఉదయం లేదంటే రాత్రి పూట వర్షం కురుస్తోంది. ఇవాళ కూడా చల్లగానే ఉంది. దీనికితోడు వచ్చే 24 గంటల్లో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్రమట్టం నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వివరించారు. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి.
ఈ నెల 8వ తేదీ వరకు వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.
గత 24 గంటల్లో నాగర్ కర్నూల్, వనపర్తి మినహా అన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. 20కిపైగా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈ సారి వర్షాలు లేట్గా పడుతున్నాయి. రుతు పవనాల రాక ఆలస్యమైంది. దీంతో అన్నదాత పనులు మరింత లేటయ్యింది. అయితే పంట కూడా అలానే లేట్ అవనుంది. పంటలకు సరిపడ నీరు అవసరం. తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రాజెక్టుల ద్వారా పంటకు సరిపడ నీరు అందనుంది. వర్షపునీటిని ఒడిసిపట్టి.. ప్రాజెక్టుల్లో స్టోర్ చేస్తున్నారు. కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును భారీ వ్యయంతో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సంగతి తెలిసిందే.