తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు: హైదరాబాద్లో రెండ్రోజులపాటు భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే కురిసన భారీ వర్షాలతో పెద్ద ఎత్తున పంటలకు నష్టం జరిగింది. గురువారం సీఎం కేసీఆర్ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామని చెప్పారు. అయితే, రానున్న ఐదు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక మార్చి 25,26, 27 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షం కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది. మరోవైపు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
అయితే, పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదై.. సాయంత్రం సమయాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం సాధారణం కంటే 1 డిగ్రీ మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొంది.

ఇది ఇలావుండగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 24, 25 తేదీల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయటికి వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications