ఆగని ఘోష: ఈ ఒక్క రోజే 9 మంది రైతుల ఆత్మహత్య
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. బుధవారం ఒక్కరోజే తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో పిట్టల బాలస్వామి, ఇదే జిల్లాకు చెందిన పత్తిరైతు కిషన్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలంలో పత్తిరైతు కృపాకర్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలో అప్పుల బాధతో ఇంట్లో ఉరేసుకుని రైతు లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లాలో గంగిడి పెంటయ్య, బాలయ్య అనే ఇద్దరు రైతులు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో ముగ్గురు రైతుల ఆత్మహత్య చేసుకున్నారు. సోమయ్య, పాపయ్య, శ్యాంరాజ్ అనే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
మంగళవారం నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వరంగల్ జిల్లా జనగామ మండలం మరిగేడు దగ్గర టోక్యాతండాలో అప్పుల బాధతో పత్తిరైతు శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం సహబత్తాపూర్లో మరో రైతు లొంక ఆశయ్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం దాసరిపల్లిలో చెట్టుకు ఉరి వేసుకొని మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం జర్పులతండాలో అప్పుల బాధతో రైతు హరిలాల్ కరెంట్ వైర్లు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారంనాడు చెప్పారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు రాసిన బహిరంగ లేఖకు ఆత్మహత్యలు చేసుకున్న 1325 మంది రైతుల జాబితాను జతచేశారు .