సీఎంకు బండి సంజయ్ రాసిన లేఖపై నిరంజన్ రెడ్డి ఫైర్.!దమ్ముంటే బకాయిలపై పీఎంకు లేఖ రాయాలని సవాల్.!
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు బండి సంజయ్ లేఖ నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేసారు. తెలంగాణ రైతాంగం పట్ల బీజేపీ మొసలి కన్నీరు ఆపాలని, యాసంగి వడ్లను కొనిపించే బాధ్యత తనదని, రైతులు వరి వేయాలన్న బండి సంజయ్ ఆ తరువాత మొఖం చాటేశాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పెద్ద మనసుతో యాసంగి వడ్లను కొనుగోలు చేశారని, రైతులను రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్న బండి సంజయ్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కునేలకు రాయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేసారు.

మద్దతు ధరలపై బండి సంజయ్ కి అవగాహన శూన్యం.. మండి పడ్డ వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి
రైతుబంధుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, 7500 కోట్ల రూపాయలకు గాను 580 కోట్ల రూపాయలకు తేడా ఎంతో బండి సంజయ్ ఎవరినన్నా లెక్కలడిగి తెలుసుకోవాలని నిరంజన్ రెడ్డి చమత్కరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏటా రైతుల కోసం రైతు భీమాకు చేస్తున్న ఖర్చు 1500 కోట్ల రూపాయలని, రైతుబంధు పథకం గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కి లేదని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పంటలకు మద్దతుధర గురించి శభాష్ .. శభాష్ అని బండి సంజయ్ చెప్పుకుంటున్నాడని, వరి ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు 3054రూపాయలని, తాజాగా పెంచిన దాని ప్రకారం కేంద్రం క్వింటాలుకు ఇస్తున్న మద్దతు ధర 2060రూపాయలన్నారు. బండి సంజయ్ కు మద్దతు ధరలపై అవగాహన శూన్యం కాబట్టి కనీసం పత్రికలు అయినా చదివి వివరాలు తెలుసుకోవాలన్నారు.

రైతుబంధు గుజరాత్ లో అమలు చేయగలరా.?బండి సంజయ్ కి నిరంజన్ సూటి ప్రశ్న..
కేంద్రం మద్దతుధరలు ప్రకటించిన 14 పంటలలో పొద్దుతిరుగుడు మినహా మరే పంట సాగు చేసినా రైతులకు గిట్టుబాటు కాదన్నారు నిరంజన్ రెడ్డి. బండి సంజయ్ కి చేతనయితే గతంలో ప్రధాని మోడీ ఇచ్చిన వాగ్దానం మేరకు స్వామినాధన్ కమిటీ సిఫారసుల ప్రకారం సీ + 50 ప్రకారం పంటలకు మద్దతుధరలు ప్రకటించాలని, లేకుంటే నోరు మూసుకొని కూర్చోవాలని ధ్వజమెత్తారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరంటు, సాగునీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, చేతనయితే ఈ పథకాలు కేంద్రం చేత రైతుల కోసం దేశమంతా అమలుచేయించాలని సవాల్ విసిరారు.

కేటీఆర్ విదేశీ పర్యటనల ఖర్చు మీకెందుకు.?మోదీ సూటు బూట్ల ఖర్చు చెప్పగలరా అని నిలదీసిన నిరంజన్
నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి, 16 నెలల రైతుల పోరాటానికి తలొగ్గి క్షమాపణలు చెప్పి, చట్టాలను వెనక్కు తీసుకున్న చరిత్ర ప్రధాని నరేంద్ర మోడీదని ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలకు వెళ్లిన కేటీఆర్ ను విమర్శిస్తున్న బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్లలో విదేశీ పర్యటనల ఖర్చు, ఆయన వేసుకునే సూటు, బూటులకు అయిన ఖర్చు సమాచార హక్కు చట్టం కింద వివరాలు తెచ్చుకుని చదువుకుంటే మంచిదని హితవు పలికారు. వ్యవస్థ మీద, సమాజంలోని సమస్యల మీద ఏ మాత్రం ఆవాహనం లేని, అవగాహన తెచ్చుకోలేని బండి సంజయ్ లాంటి నేతలకు పదవులు ఇవ్వడం పిచ్చోడి చేతిలో రాళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేసారు నిరంజన్ రెడ్డి.

. కార్పోరేటర్లను మోదీతో సమావేశపరిచారు.. ఒక్క సమస్యగురించైనా చర్చించారా అన్న నిరంజన్ రెడ్డి..
ఫసల్ భీమా పథకంలో అంత పస ఉంటే మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలుచేయడం లేదో అడిగి తెలుసుకోవాలని నిరంజన్ రెడ్డి బండి సంజయ్ ని సూటిగా ప్రశ్రించారు. పాలమూరు పాదయాత్రలో ఆర్డీఎస్ అంతటికీ సాగునీళ్లు, ఆరు నెలలలో సమస్య పరిష్కారం అని చెప్పిన బండి సంజయ్ ఆ పనులు ఎంతవరకు వచ్చాయో పాలమూరు ప్రజలకు చెప్పాలన్నారు. హైదరాబాద్ కార్పోరేటర్లతో ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పావలా అయినా హైదరాబాద్ అభివృద్ధి కొరకు తీసుకొచ్చారా? అని నిలదీసారు. పత్రికా ప్రకటనల్లో బట్టలు చించుకోవడం మినహా బీజేపీ నేతలు రాష్ట్రానికి తెచ్చిన నిధులు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు ఏమున్నాయో ప్రజలు గమనిస్తున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications