అదనపు ఛార్జీల్లేవ్: ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ ఎండీ
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మంచి వార్త అందించింది. ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్లు వస్తున్న వార్తలపై టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్పష్టతనిచ్చారు. అంతేగాక, ఇక ముందు తెలంగాణ రాష్ట్రంలో అదనపు ఛార్జీలు ఉండవని తెల్చి చెప్పారు.
గడిచిన 5 రోజుల్లనే 1.3 కోట్ల మంది ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు ఆర్టీసీ చేర్చిందని, దీనిపై తనకు చాలా సంతోషంగా ఉందన్నారు సజ్జనార్. టీఎస్ఆర్టీసీని ప్రయాణీకులు ఆదరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్న ప్రయాణిక దేవుళ్ళందరికి వందనాలు అని చెప్పారు సజ్జనార్.
ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికుల సౌకర్యం భధ్రతే ధ్యేయంగా ఈ పండుగ సమయంలో తాము ఆర్టీసీ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీలో ప్రయాణిస్తూ ప్రయాణీకులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునందిస్తాయని తాము ఆకాంక్షిస్తున్నామని వెల్లడించారు. అందరు ప్రతి ప్రయాణాన్ని ఆర్టీసీ బస్సులో చేసి, సురక్షితంగా గ్యమస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ కోరారు.
కాగా, పండగలకు అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా ఆర్టీసీ బస్సులు నడపడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ఇంతకుముందు పండగలకు స్పెషల్ బస్సులు నడుపుతూ అదనపు ఛార్జీలు వసూలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం అదనపు ఛార్జీలు లేకుండానే సాధారణ ఛార్జీలను కొనసాగించడం గమనార్హం. దసరా పండగను పురస్కరించుకుని లక్షలాది మంది ప్రజలు తమ తమ స్వగ్రామాలకు తరలివెళుతున్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణిస్తుండటంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి.

ఐదుగురు మృతి చెందిన ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి: 5 లక్షల ఎక్స్గ్రేసియా
జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని అదేశించారు. శనివారం రాత్రి కొత్తపల్లిలో గుడిసె గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. సీఎం కేసీఆర్.. మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వారి కుటుంబంలో మిగతా వారికి ప్రభుత్వపరంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, నిర్మాణాలను అధికారులు గుర్తించాలని సూచించారు. ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఈమేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. మృతి చెందిన కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు.
Recommended Video
కాగా, ఐజ మండలం కొత్తపల్లిలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గుడిసె గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. గోడపక్కనే నిద్రిస్తున్న కుటుంబం యజమాని మోష, భార్య శాంతమ్మ, పిల్లలు చరణ్, తేజ, రాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు పిల్లలు స్నేహ, చిన్న ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడినవారిని 108 వాహనంలో కర్నూలులోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications