మంగ్లీ కారుపై దాడి జరిగిందా?: క్లారిటీ ఇచ్చిన సింగర్
హైదరాబాద్: తన కారుపై దాడి జరిగిందంటూ వస్తున్న వార్తలపై సింగర్ మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఓ కార్యక్రమంలో తన కారుపై దాడి జరిగిందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. తనపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయిన మండిపడ్డారు.
ఈవెంట్ సక్సెస్ అయ్యిందని.. తాను చేసిన ఉత్తమ ఈవెంట్లలో ఇది ఒకటని మంగ్లీ తెలిపారు. కన్నడ ప్రజలు తనపై అపారమైన ప్రేమను చూపించారని చెప్పారు. ఈవెంట్లో తనను బాగా చూసుకున్నారని చెప్పారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలా చేస్తున్నారని మంగ్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
బళ్లారి మున్సిపల్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బళ్లారి ఉత్సవకు మంగ్లీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ లో పాటలు పాడి- ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమానికి కన్నడ నటుడు రాఘవేంద్ర రాజ్ కుమార్, ఆయన తమ్ముడు దివంగత పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని రాజ్ కుమార్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
అయితే, ఈ కార్యక్రమంలో మంగ్లీ కన్నడలో మాట్లాడలేదనే అసహనంతో కొందరు ఆమెపై దాడికి యత్నించారని వార్తలు వచ్చాయి. ఆమె కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని ప్రచారం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు రావడంతో చివరకు మంగ్లీ.. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.