టీఆర్ఎస్ సర్కారుకు ఈసీ షాక్: బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది, ఇక అంతే!
Recommended Video

హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గతేడాది చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున చీరల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది.

చీరల పంపిణీకి బ్రేక్
రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. బతుకమ్మ చీరల పంపిణీకి ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తింపు అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ సెప్టెంబర్ 28న సీఈసీకి వివరణ కోరుతూ లేఖ రాయగా, కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ కేపీ సింగ్ బుధవారం ఈ మేరకు బదులిచ్చారు.

చీరల పంపిణీపై ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదులు
ఈ విషయాన్ని రజత్ కుమార్ హైదరాబాద్లోని మీడియా ప్రతినిధులకు ధ్రువీకరించారు. రాష్ట్రంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఓటర్లకు ప్రలోభపెట్టేందుకు వ్యక్తిగత లబ్ధి కలిగించే బతుకమ్మ చీరలు, రైతు బంధు చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోందని విపక్ష పార్టీలు కాంగ్రెస్, టీడీపీలు సైతం పలుమార్లు రజత్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం రావడం గమనార్హం.

చేనేత కార్మికుల కోసం..
చీరల ఉత్పత్తి ద్వారా రాష్ట్రంలోని చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించడంతో పాటు తెలంగాణ పండుగ బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్త నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రకటించడంపై నిషేధం అమల్లో ఉంది.

పాత పథకమే అయినప్పటికీ..
అయితే గతేడాదే ప్రారంభించిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని పాత కార్యక్రమంగా పరిగణించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుందని రాష్ట్రంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం భావించింది. కానీ, అనూహ్య రీతిలో అనుమతి నిరాకరించడంతో టీఆర్ఎస్ ఆపద్ధర్మ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు. అయితే, ఇప్పటికే రూ.280కోట్ల విలువ చేసే చీరలను కొనుగోలు చేసినా.. ఎన్నికల తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని మహిళలకు పంచే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications