ఏమీ అనొద్దు, చిక్కుల్లో పడతాం!: కోదండరాంపై తగ్గిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదాండరాంను ఎవరూ ఏమనవద్దని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశించారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రులకు, తెరాస నేతలకు ఆయన ఈ సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్.. కేసీఆర్ పాలన పైన ఇటీవల విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రుల నుంచి తెరాస నాయకుల వరకు ఆయన పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే, ఆయనను ఏమీ అనవద్దని సూచించారని తాజాగా తెలుస్తోంది.
రెండు మూడు రోజులుగా కోదండరాం పైన తెరాస నేతలు పెద్దగా మాట్లాడటం లేదు. కాబట్టి కేసీఆర్ ఆదేశాలు నిజమే కావొచ్చునని అంటున్నారు. కోదండరాంను విమర్శిస్తే విపక్షాలు దానిని క్యాష్ చేసుకుంటాయని కేసీఆర్ మంత్రులకు, పార్టీ నేతలకు సూచించారని తెలుస్తోంది.

తెలంగాణ ఉద్యమం సమయంలో కోదండరాం జేఏసీ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. రెండేళ్ల కేసీఆర్ పాలన పైన ఆయన ఇటీవల విమర్శలు గుప్పించారు. దీంతో, మంత్రులు హరీష్ రావు నుంచి మొదలు తెరాస నాయకులు ఆయన పైన దుమ్మెత్తి పోశారు.
దానికి కోదండరాం కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తెరాస నేతలు ఎన్ని విమర్శలు చేసినా తాను ఎన్నో ఏళ్లుగా ప్రజల కోసం పని చేస్తున్నానని, ఇప్పుడు కూడా అదే విధంగా తెలంగాణ ప్రజల కోసం గళం విప్పుతానని చెప్పారు. అంతేకాదు, ఆయనకు విపక్షాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడా లభించింది.
ఈ నేపథ్యంలో, కోదండరాం పైన విమర్శలు చేస్తే మొదటికే మోసం వస్తుందని, ఇప్పటి వరకు తెరాస పైన ప్రజల్లో పెద్ద వ్యతిరేకత లేదని, ఆయనను విమర్శిస్తే వ్యతిరేకత పెరిగే అవకాశముందని భావించిన కేసీఆర్.. అలా ఆదేశాలు జారీ చేసి ఉంటారని చెబుతున్నారు.
ఈ రెండేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వానికి ధీటైన ప్రతిపక్షమే లేకుండా పోయిందని చెప్పవచ్చు. కానీ, కోదండరాం ఇటీవల బయటకు రాగానే తెరాసలో వణుకు కనిపించిందని, అందుకే కోదండను విమర్శించి తేనేతుట్టెను కదపడం ఎందుకని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. మిగిలిన జేఏసీ నేతలు కూడా కోదండ వెంటే నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయనకు విపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది.












Click it and Unblock the Notifications