పైరవీల కోసం తిరగాల్సిన అవసరం లేదు: పారిశ్రామికవేత్తలతో కెసిఆర్
హైదరాబాద్: పరిశ్రమలకు అనుమతులు పొందడానికి పైరవీలు చేయడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆయన శుక్రవారం పారిశ్రామికవేత్తల మధ్య విడుదల చేశారు. పది, పదిహేను రోజుల్లో పరిశ్రమలకు అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు
వంద శాతం అవినీతిరహితంగా పరిశ్రమలకు అనుమతులు లభిస్తాయని, ఈ హామీని తాను ఇస్తున్నానని ఆయన చెప్పారు. తమది అత్యంత సరళమైన పారిశ్రామిక విధానమని ఆయన చెప్పారు. పరిశ్రమల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి కృతజ్ఞతలని ఆయన చెప్పారు.
పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులు ఇస్తామని ఆయన చెప్పారు. నీరు, విద్యుత్తు, భూమి వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందని ఆయన అన్నారు. దేశంలో మూడో వంతు ఫార్మా రంగం తెలంగాణలోనే ఉందని ఆయన చెప్పారు. హైదరాబాదులో ఫార్మా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
పారిశ్రామికవేత్తల అంచనాలను తాము నిరాశపరచబోమని ఆయన చెప్పారు. మహిళలకే కాకుండా అందరికీ పూర్తి స్థాయి భద్రతను హైదరాబాదులో కల్పిస్తామని ఆయన చెప్పారు. లక్షా 15 వేల కెమెరాలతో హైదరాబాదులో నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.