నాగార్జునసాగర్ ఉపఎన్నిక వేళ... రాజకీయ పార్టీలకు షాకిచ్చిన ఆ రెండు గ్రామాలు...
నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆ రెండు గ్రామాల ప్రజలు రాజకీయ పార్టీలకు షాకిచ్చారు. 'మా గ్రామంలోకి రాజకీయ నాయకునికి అనుమతి లేదు...' అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ గ్రామాలు ఎటువంటి అభివృద్దికి నోచుకోలేదని అందులో పేర్కొన్నారు. అంతేకాదు,తమ గ్రామాల ప్రజలు ఓటుకు అమ్ముడుపోరని... తమకు అభివృద్దే ముఖ్యమని వెల్లడించారు. గ్రామంలో ఉన్న సమస్యలను ఏకరువు పెడుతూ గగ్గినపల్లివారిగూడెం,కుమ్మరిగూడెం గ్రామస్తులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
సాధారణంగా ఓట్ల నాడే రాజకీయ నాయకులు తమ వద్దకు వస్తారని... ఆ తర్వాత ఐదేళ్ల వరకూ తమవైపు కనీసం తొంగి కూడా చూడరన్న విమర్శలు ఎన్నికల సమయంలో వినిపిస్తూ ఉంటాయి.అందుకే ఓట్ల కోసం వచ్చే నాయకులను కొన్నిచోట్ల జనం గట్టిగా నిలదీస్తుంటారు. దీంతో కొంతమంది నాయకులు బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టి మరీ అభివృద్ది పనులకు హామీ ఇస్తుంటారు. అయినప్పటికీ ఆ హామీలు నెరవేరుతాయా అంటే చెప్పడం కష్టమే. ప్రస్తుతం సాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇదే సరైన సమయం అనుకుని రాజకీయ నేతలను నిలదీసేందుకు ఈ రెండు గ్రామాల ప్రజలు సిద్దమవుతున్నారు. గ్రామంలోకి అడుగుపెట్టే నేతలను అభివృద్ది గురించి నిలదీయాలని భావిస్తున్నారు.
మరోవైపు, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే తమకు ఫ్లోరైడ్ బాధ తప్పిందని సాగర్ నియోజకవర్గానికి చెందిన కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అటు టీఆర్ఎస్ పార్టీ కూడా క్షేత్రస్థాయిలో తమ పార్టీ నేతలను ఇన్చార్జిలుగా నియమించి ప్రచారంలో దూసుకుపోతుంది. పలువురు కీలక నేతలు సాగర్లోనే మకాం వేసి సిట్టింగ్ స్థానాన్ని తిరిగి సాధించుకోవాలని కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ది పనులు, సాగర్ నియోజకవర్గంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడిజిల్లా పరిధిలో రూ.2395.68 కోట్ల వ్యయంతో 13 ఎత్తిపోతల పథకాలు, పలుచోట్ల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.
సాగర్ ఉపఎన్నికలో ఇప్పటివరకూ కాంగ్రెస్ మాత్రమే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. సీనియర్ నేత జానారెడ్డి కాంగ్రెస్ తరుపున ఈ నెల 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. మన్నె రంజిత్,శ్రీనివాస్ యాదవ్,తేరా చిన్నపరెడ్డి తదితరుల పేర్లను పరిశీలించిన టీఆర్ఎస్ చివరకు నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్కే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం వరకూ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు బీజేపీ కూడా అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చుకోలేక తర్జనభర్జన పడుతోంది. నివేదితా రెడ్డి,అంజయ్య యాదవ్ ఆ పార్టీ టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. మంగళవారం(మార్చి 29) నామినేషన్లకు చివరి రోజు కావడంతో సోమవారం సాయంత్రం వరకు టీఆర్ఎస్,బీజేపీలు తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.