కేసీఆర్! నాకే స్వార్థం ఉంటే, కాంగ్రెస్తో 37 ఏళ్లు పోరాడా.. సిద్ధాంతాలు వేరుకాదు: బాబు షాకింగ్
హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ గతంలో తనను పొగిడి ఇప్పుడు రాజకీయాల కోసమే విమర్శలు చేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం చెప్పారు. ఆయన శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
నందమూరి సుహాసినికి వైసీపీ భారీ దెబ్బ: ఓడితే ఏపీ సీఎంగా.. ఇదీ జగన్ లెక్క!
2009 ఎన్నికల్లో చంద్రబాబు అంటే సంపద సృష్టికర్త అని, ఆయన వల్లనే తెలంగాణ అభివృద్ధి అయిందని, హైదరాబాద్ బాగుపడిందని కేసీఆర్ చెప్పారని తెలిపారు. అలాగే, మైక్రోసాఫ్ట్ రావడానికి కారణం చంద్రబాబేనని గతంలో కేటీఆర్ అన్నారని చెప్పారు. అప్పుడు పొగిడి ఇప్పుడు ఎందుకు తిడుతున్నారో చెప్పాలన్నారు. ఇది రాజకీయం కాదా అన్నారు.
ఈ గడ్డపై పుట్టిన పార్టీ టీడీపీ
టీడీపీ తెలంగాణలో ఎందుకు ఉండవద్దని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ ఈ గడ్డపై పుట్టిన పార్టీ అన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని కేసీఆర్ను ఎన్నిసార్లు కోరినా ఆయన వినలేదన్నారు. ఆయనకు రాజకీయాలు కావాలన్నారు. బీజేపీకి తోక పార్టీ తెరాస అన్నారు. తెరాసకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు. దేశాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
నేను అలా బండమాటలు మాట్లాడను
కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. తాను అలా బండమాటలు మాట్లాడనని చెప్పారు. అది తన సంస్కృతి కాదన్నారు. సంస్కార హీనంగా మాట్లాడనని చెప్పారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో చెప్పాలన్నారు. గోదావరి జలాల వినియోగం కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నో ప్రాజెక్టులు తామే ప్రారంభించామని చెప్పారు. కష్టాల్లో ఉన్న ఏపీని తాము అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
స్వార్థం ఉంటే ఐటీ కంపెనీలను తిరుపతికి తీసుకెళ్లేవాడిని
తనకు స్వార్థం ఉంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతికే ఐటీ కంపెనీలను తీసుకు వెళ్లేవాడిని అని చంద్రబాబు అన్నారు. బంగారం లాంటి తెలంగాణను కేసీఆర్కు అప్పగిస్తే నిర్వీర్యం చేశారన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్రూం ఆశ చూపి ప్రజలను మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఒకప్పుడు శేరిలింగంపల్లి టీడీపీ కంచుకోట అన్నారు. కేసీఆర్ దళితులకు మూడు ఎకరాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చారా అని నిలదీశారు. తాను ప్రపంచమంతా తిరిగి హైదరాబాదుకు ఐటీ కంపెనీలు తీసుకు వచ్చానని చెప్పారు. అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అన్నారు.
తెరాసకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే
ఏ పని జరిగినా దానికి నాంది తెలుగుదేశం పార్టీనే అని చంద్రబాబు అన్నారు. విభజన సమయంలో రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని తాను కోరానని చెప్పారు. తెలంగాణకు న్యాయం చేయలేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేస్తారని ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతిస్తే ఆయన కూడా మొండిచేయి చూపాడన్నారు. నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమైందని అన్నారు. తెరాసకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని చెప్పారు. తెలంగాణ అబివృద్ధి చెందాలనేది తన కోరిక అన్నారు. తెలుగుదేశం పార్టీ లేకుంటే కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. ఏపీ, తెలంగాణ ముందుకెళ్లాలని చెప్పారు. తెలుగువారు ఉన్న ప్రతిచోట టీడీపీ ఉంటుందన్నారు.
37 ఏళ్లు కాంగ్రెస్ పార్టీతో పోరాడా
కాంగ్రెస్ పార్టీతో తాను 37 ఏళ్లు పోరాడానని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు దేశ భవిష్యత్తు కోసం తాను కలిసి పని చేస్తున్నానని చెప్పారు. బీజేపీతో తాము ఎప్పుడూ సిద్ధాంతంగా తాము ఒక్కటి కాదని చెప్పారు. దేశం విషయంలో కాంగ్రెస్, తమ మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు లేవని చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపు చారిత్రక అవసరమని చెప్పారు. తనకు ఎలాంటి స్వార్థం లేదని చెప్పారు. మోడీ, కేసీఆర్ ప్రజలకు భద్రత ఇవ్వలేకపోతున్నారని చెప్పారు. బీజేపీ బీ టీమ్ తెరాస అన్నారు. ప్రపంచమంతా తిరిగి హైదరాబాదుకు ఐటీ కంపెనీలు తీసుకు వచ్చానని చెప్పారు.
మోసం చేసిన వారిని మళ్లీ గెలిపిస్తారా
దేశం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తాను పోరాటం చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. పార్టీ మారి మోసం చేసిన వారి మళ్లీ గెలిపిస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. మోసం చేసిన వారికి గుణపాఠం చెప్పాలన్నారు. మోడీ హయాంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయన్నారు. దేశంలో మోడీ నియంతలా పాలిస్తున్నారని చెప్పారు. మోడీ, కేసీఆఱ్ పాలనలో ప్రజలకు ఆర్థిక భద్రత లేకుండా పోయిందన్నారు.
ప్రశ్నిస్తే దాడులు
నరేంద్ర మోడీ అదృష్టం కలిసి వచ్చి ప్రధానమంత్రి అయ్యారని చెప్పారు. ప్రశ్నించిన వారిపై ఐటీ, సీబీఐ దాడులు చేపిస్తున్నారని విమర్శించారు. సైబరాబాద్ తన మానసిక పుత్రిక అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ కృషి ఉందని చెప్పారు. హైదరాబాదులో నేను టూరిజాన్ని ప్రమోట్ చేశానని అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంస్థలను ఇక్కడకు తీసుకు వచ్చానని చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చామన్నారు. దేశాన్ని మోడీ దగా చేస్తే తెలంగాణను కేసీఆర్ దగా చేశారని చెప్పారు.