తల్లుల గొడవ: కెసిఆర్ సేఫ్ గేమ్ అందెశ్రీ అంతే, రేవంత్ ప్రశ్న
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ తల్లి, తెలుగు తల్లి వివాదాలకు చోటు లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే దీనిపై వివాదం చెలరేగుతోంది.
గేయాల విషయంలోనూ ఆయన అదే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాటను గానీ, జయ జయహే తెలంగాణ గేయాన్ని గానీ ఆలపించకూడదని ఆయన కట్టడి చేసినట్లు సమాచారం. జాతీయ గీతాలాపనతో మహాసభలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కెసిఆర్ తెలంగాణ తల్లిని మరిచిపోయారని...
తెలంగాణ తల్లిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరిచిపోయారని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగు తల్లి ఎవరు అని ప్రశ్నించిన కెసిఆర్ ఇప్పుడు తెలంగాణ తల్లిని తెలుగు మహా సభల్లో స్థానం ఎందుకు కల్పించలేదని ఆయన అడిగారు. బుధవారం చేవెళళ, రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు చెందిన టిడిపి, టిఆర్ఎస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్రెడ్డి, రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
ఆంధ్ర రచయితను ఆహ్వానించి, అందెశ్రీని...
తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన కళాకారులకు తెలుగు మహా సభల్లో కెసిఆర్ స్థానం లేకుండా చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆంధ్ర రచయిత నరసింహామూర్తిని ఆహ్వానించిన ముఖ్యమంత్రి కెసిఆర్కు తెలంగాణకు చెందిన అందెశ్రీ, విమలక్క గుర్తు రాలేదా? అని ఆయన అడిగారు.
కెసిఆర్ క్షమాపణ చెప్పాలని...
ప్రపంచ తెలుగు మహాసభల్లో కెసిఆర్ తెలంగాణ తల్లిని గౌరవిస్తారా, తెలుగు తల్లిని గౌరవిస్తారా అని కాంగ్రెసు పార్టీ ప్రశ్నిస్తోంది. వేదికపై తెలుగుతల్లికి పూలదండ వేయాలనుకుంటే తెలంగాణ ఉద్యమంలో తెలుగుతల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కెసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఈ విమర్శల నేపథ్యంలో కెసిఆర్ సేఫ్ గేమ్ ఆడాలని జాతీయ గీతాన్ని ముందుకు తెచ్చినట్లు చెబుతున్నారు.
తెలంగాణ తల్లికే వేదికపై స్థానం
విస్తృతమైన చర్చల తర్వాత వేదికపై తెలంగాణ తల్లికి పూలమాల వేయాలని కెసిఆఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని వేదికపై నెలకొలుపుతారు. అయితే, మా తెలుగు తల్లి గానీ, జయ జయహే తెలంగాణ తల్లి గీతాలాపన గానీ ఉండదని సమాచారం.