హమ్మయ్యా..ఫాం హౌస్ నుంచి వెళ్లిపోయిన చిరుత, పాదముద్రల ఆధారంగా డాగ్ స్క్వాడ్ గుర్తింపు...
హైదరాబాద్ శివారు ఫాంహౌస్ నుంచి చిరుత వెళ్లిపోయిందని అటవీ అధికారులు తెలిపారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం ఉదయం నుంచి బిక్కుబిక్కుమన్న స్థానికులు.. చిరుత వెళ్లిపోయిందని అధికారులు చెప్పడంతో రిలాక్స్ అయ్యారు. అటవీ ప్రాంతంలో చిరుత పాదముద్రలను గుర్తించి.. అది వెళ్లిపోయిందని అధికారులు స్పష్టంచేశారు. నిన్న మొదలైన సెర్చ్ ఆపరేషన్ ఇవాళ కూడా కొనసాగింది. 50 ఎకరాల అటవీ విస్తీర్ణంలో చిరుత లేదు అని.. నిర్ధారించుకొన్న తర్వాత మీడియాకు తెలియజేశారు.

చిరుతు అడుగులు..
జీహెచ్ఎంసీ, పోలీసుల సహకారంతో ఫాంహౌస్లో అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి.. చిరుత ఆచూకీ కోసం ప్రయత్నించారు. చిరుత పాదముద్రలను గుర్తించారు. అక్కడికి డాగ్ స్క్వాడ్ తీసుకొని వెళ్లగా... చిరుత అడుగులను శునకాలు పరిశీలించాయి. ఫాం హౌస్ నుంచి వెళ్లిపోయినట్టు సంకేతాలు ఇచ్చాయి. అటవీ నుంచి వెళ్లిపోయిందని వారు నిర్దారణకు వచ్చారు. ఫాం హౌస్లో ఉన్న జంతువులను తినేందుకు చిరుత వచ్చిందని అధికారులు భావిస్తున్నారు

టెన్షన్..టెన్షన్...
గురువారం ఉదయం బుద్వేల్.. రైల్వేస్టేషన్ వద్ద ఉదయం చిరుతపులి సంచరించింది. రోడ్డుపై కొద్దిసేపు ఉన్నా తర్వాత.. సమీపంలో ఉన్న ఫాం హౌస్లోకి వెళ్లింది. అందులోకి వెళ్లడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టారు. ఎక్కడ చిరుత ఉందోనని డ్రోన్ కెమెరాలతో గాలించారు. చిరుత బయటకొచ్చేందుకు రెండు మేకలను కూడా ఏర్పాటు చేశారు. బోనులోకి వస్తే.. ఇరుక్కొనే ఏర్పాట్లు కూడా చేశారు. బల్దియా సిబ్బంది 10 శునకాలను కూడా రంగంలోకి దించాయి. కానీ అదీ బయటకు రాలేదు. జాడ తెలియలేదు. కానీ రాత్రికి రాత్రి.. ఫాం హౌస్ నుంచి వెళ్లిపోయిందని పాదముద్రల ఆధారంగా తెలుస్తోంది.

ఎటు వెళ్లిందో..
చిరుతపులి నిజంగా వెళ్లిపోయిందా.. లేదంటే ఫాంహౌస్లోనే నక్కి ఉందా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిరుత వెళ్లిందని చెబుతున్నారు.. కానీ ఏటు వెళ్లిందనే అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదు అని వారు వాదిస్తున్నారు. అయితే దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications