భర్త చనిపోతే రైల్లోనే మృతదేహన్ని వదిలివెళ్ళింది, ఎందుకంటే
భర్త చనిపోతే మృతదేహన్ని స్వగ్రామానికి తరలించేందుకు డబ్బులులేకపోవడంతో్ నాగపూర్ రైల్వేస్టేషన్ లోనే ఆ మృతదేహన్ని వదిలివేసింది .
భువనేశ్వర్ :ఉపాధి కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళారు. అనారోగ్యంతో భర్త మరణించాడు. భర్త మృతదేహన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఆమె వద్ద డబ్బులు లేవు. దీంతో ఆ శవాన్ని ఆమె అక్కడే వదిలివేసి స్వగ్రామానికి చేరుకొంది.
ఒడిశా రాష్ట్రంలోని నువాపడా జిల్లా కొమన్ సమితి పరిధిలోని దావొజోలా గ్రామానికి చెందిన సరోజిగి నాగ్ , జుగల్ దంపతులు ముగ్గురు పిల్లలతో కలిసి స్వగ్రామాన్ని వదిలి కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి వలస వచ్చారు. ఇక్కడే ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నారు.నెలరోజుల క్రితమే వారు తమ గ్రామం నుండి పెద్దపల్లికి చేరుకొన్నారు.
పెద్దపల్లికి చేరుకొన్న పదిరోజుల తర్వాత జుగలు అనారోగ్యానికి గురయ్యాడు. అయితే ఆయన స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకొన్నాడు. అయినా కోలుకోలేదు. అయితే స్వగ్రామం వెళ్ళి చికిత్స చేయించాలని ఆ దంపతులు భావించారు.
ఇటుక బట్టీ యజమానికి వారికి నాగపూర్ వరకు వెళ్ళేందుకు రైలు టిక్కెట్లను బుక్ చేయించాడు. నాగ్ పూర్ నుండి వారి స్వగ్రామం వెళ్ళేందుకు వేరే ట్రైన్ ఎక్కాల్సి ఉంది. అయితే నాగ్ పూర్ చేరుకొన్నాక జుగల్ మరణించాడు.
నాగపూర్ నుండి మరో రైలులో వెళ్ళేందుకుగాను ఆమె వద్ద డబ్బులు లేవు. మరో వైపు ఈ విషయాన్ని ఆమె రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది. అయినా వారి నుండి స్పందన లేకపోయింది. ఎలాగోలా ఆమె పిల్లలతో కలిసి తన స్వగ్రామానికి చేరుకొంది. భర్త మృతదేహాన్ని నాగపూర్ లోనే వదిలేసింది. డబ్బులు లేక తన భర్త మృతదేహాన్ని నాగపూర్ లోనే వదలివేసిన విషయాన్ని ఆమె గ్రామస్థులకు వివరించింది. ఈ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు గ్రామస్థులు ప్రయత్నిస్తున్నారు.