సోనియా ఇస్తే...: కేసీఆర్, బెజవాడ కంటే హైద్రాబాదే...
హైదరాబాద్: తెలంగాణను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చారంటే.. మరి తెచ్చిందెవరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఉద్యోగ నియామకాల పైన పదేళ్ల వరకు సడలింపు ఇచ్చే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కేసీఆర్ శనివారం నాడు శాసన మండలిలో మాట్లాడారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీయేనని, ఇది ఎవరూ కాదనలేని సత్యమని కానీ, తెచ్చింది ఎవరో గుర్తు చేసుకోవాలన్నారు. ఆయన ఈ వ్యాఖ్య చేసిన వెంటనే అసెంబ్లీలో నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా, కేంద్ర నిధుల కుదింపు, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన పథకాలు తదితరాలపై సీఎం కేసీఆర్ స్పందించాలని కాంగ్రెస్ సభ్యుడు డి శ్రీనివాస్ కోరారు.
దీంతో, కేంద్ర నిధులతోపాటు వివిధ అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. సోనియా ప్రస్తావన తీసుకొచ్చారు. తెలంగాణ గురించి చరిత్రలో ఏం రాసినా అందులో సోనియా పేరు తప్పక ఉంటుందన,ి కాంగ్రెస్ నాయకుల్లోనూ ఆమోస్, యాదవ రెడ్డి తదితరులు కొందరు పోరాటంలో ముందున్నారని, తాను దీక్ష చేసిన తర్వాత విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చారని, ఆ తర్వాత తెలంగాణ సమాజమంతా ఉద్యమంలో పాల్పంచుకుందన్నారు.

దీంతో, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించే కొన్ని పథకాలకు సోనియా పేరు పెట్టాలని కొందరు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయగా పరిశీలిస్తామని కేసీఆర్ చెప్పారు. కేంద్ర బడ్జెట్లో అనేక పథకాలను కుదించారని, దాంతో రాష్ర్టానికి వచ్చే నిధులు తగ్గుతాయని, దీనిపై కేంద్రంతో ఘర్షణ ధోరణితో కాకుండా సామరస్యంగా చర్చించుకోవాలన్నారు. ప్రణాళికా సంఘం సభ్యులు గతంలో సీఎంలను బెగ్గర్స్గా చూసేవాళ్లని, ఇప్పుడు నీతి ఆయోగ్లో సీఎంలే సభ్యులవటంతో మార్పు వచ్చిందన్నారు.
కేంద్ర పథకాల్లో రూ.3000 కోట్లు మన రాష్ర్టానికి రానున్నాయని, ఎఫ్ఆర్బీఎఫ్ పరిమితి పెంపుతో మరో 6500 కోట్లు రానున్నాయన్నారు. కేంద్రం నుంచి మరిన్ని పథకాలకు నిధులు కోరేందుకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఢిల్లీ వెళదామన్నారు.
హైదరాబాదులో రియల్ బూమ్ పుంజుకుందన్నారు. పెట్టుబడులు పెట్టడానికి అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ వస్తున్నాయన్నారు. బెజవాడలో బూమ్ పడుకుందన్నారు. ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా ఇప్పుడు హైదరాబాద్కు తరలి వస్తున్నారన్నారు. తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరాకు కట్టుబడి ఉన్నామని, గత ఏడాదిలో ఇదే నెలలో ఉన్న కోతలు ఇప్పుడు లేవన్నారు. తాను విద్యుదుత్పత్తిపై సమీక్షిస్తున్నానని చెప్పారు.
విద్యుత్తు ఇచ్చేది లేదని చంద్రబాబు చెప్పడం వల్ల మంచే జరిగిందన్నారు. బయటి కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ ఏడాదిలోనే రైతులకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని, 2017 నాటికి రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. త్వరలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అవసరమైతే ఉద్యోగాల భర్తీకి పదేళ్ల వయో పరిమితి సడలిస్తామన్నారు.












Click it and Unblock the Notifications