'కరోనా' కష్టాలు వర్ణనాతీతం... జోరు వానల వేళ దిక్కు లేని పక్షుల్లా... అయినవాళ్లూ ముఖం చాటేస్తున్నారు
కరోనా వైరస్... ఈ పేరు వింటేనే చాలామంది హడలిపోతున్నారు. ఎక్కడో పక్క వీధిలో వచ్చిందంటేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇక తమ పక్కనే వచ్చిందని తెలిస్తే... ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కోవడం ఎంత కష్టమో.... ఇరుగు పొరుగు చూపించే వివక్ష,సహాయం చేసేందుకు అయినవాళ్లు కూడా ముందుకు రాని పరిస్థితులను ఎదుర్కోవడం అంతే కష్టంగా మారింది.
Recommended Video
హోమ్ ఐసోలేషన్ పూర్తయి కరోనా నెగటివ్ వచ్చినా... బయటకు వెళ్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న భయం కూడా వెంటాడుతోంది. ఇక కరోనా పేషెంట్ల వెంట ఆస్పత్రులకు వెళ్లేవారు.. ఎక్కడా ఏ ఆశ్రయం లేక ఫుట్ పాత్ల పైనే నిద్రిస్తున్న దయనీయ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.
జనాల్లో విపరీతమైన భయం...
ఇటీవల మంచిర్యాల జిల్లాలోని ఓ పట్టణానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్గా తేలింది. తేలికపాటి లక్షణాలు ఉండటంతో వైద్యులు ఆమెను హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. స్థానిక ఆశా వర్కర్లు ఆ ఇంటికి పింక్ రిబ్బన్ కట్టి వెళ్లారు. కరోనా భయంతో పొరుగువాళ్లు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. గాలి ద్వారా కూడా కరోనా సోకుతుందన్న ప్రచారం నేపథ్యంలో... ఆ ఇంటి కిటికీలు తెరిచినా చుట్టుపక్కల వాళ్లు అభ్యంతరం చెప్పారు. స్థానికంగా ఉన్న దూరపు బంధువులే... ఆ ఇంటి ముందు నిత్యావసరాలను పెట్టి వెళ్లేవారు.
ముఖం చాటేస్తున్న బంధువులు.. తప్పని తిప్పలు...
కరోనా పేషెంట్ల వెంట ఆస్పత్రులకు వెళ్తున్నవారి కష్టాలు కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో పేషెంట్లకు మినహా కుటుంబ సభ్యులకు అనుమతి లేకపోవడంతో ఎక్కడికెళ్లాలో తోచని పరిస్థితి. అదే పట్టణంలో లేదా నగరంలో బంధువులు ఉన్నా... అక్కడికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడ తమకూ కరోనా సోకుతుందేమోనన్న భయంతో బంధువులు ఫోన్లు కూడా స్విచ్చాఫ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఊరిలో లేమని చెప్తున్నారు. దీంతో దిక్కులేని పరిస్థితుల్లో చాలామంది రోడ్డు పక్కన ఫుట్ పాత్ల పైనే నిద్రిస్తున్నారు.
దిక్కులేని పక్షుల్లా...
హైదరాబాద్ నగరంలో గాంధీ,కింగ్ కోఠి,చెస్ట్ ఆస్పత్రులకు కరోనా పేషెంట్ల వెంట వచ్చే కుటుంబ సభ్యులకు మెట్రో పిల్లర్లే ఆవాసంగా మారుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కరోనా బాధితుల కుటుంబ సభ్యులకు అవే దిక్కయ్యాయి. అయితే మిగతా పట్టణాలు,నగరాల్లో మాత్రం కరోనా పేషెంట్ల వెంట వచ్చే సహాయకులకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాలు జోరుగా కురుస్తుండటంతో ఫుట్పాత్లపై కూడా నిద్రించే పరిస్థితి లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఇంటికి వెళ్లలేక,ఎక్కడా ఏ ఆశ్రయం లేక దిక్కు లేని పక్షుల్లా తల్లడిల్లుతున్నారు. బస్టాండ్లలో ఉండే టాయిలెట్స్,సులభ్ కాంప్లెక్సుల్లోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.
సాధారణ మరణమైనా...
కరోనా నేపథ్యంలో ప్రజల్లో విపరీతమైన భయం,అనుమానాలు నెలకొన్నాయి. సాధారణ వ్యాధితో ఆస్పత్రిలో చేరి ప్రాణాలు విడిచినా... బంధువులు అటువైపు వెళ్లేందుకు జంకుతున్నారు. కరోనాతోనే చనిపోయాడేమోనన్న అనుమానంతో... ఎంత దగ్గరివాళ్లయినా సరే సహాయం చేసేందుకు ముందుకు రావట్లేదు. కరోనా కారణంగా ఇలా చాలామంది అనేక అవస్థలు పడుతున్నారు. సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తప్ప ఈ కష్టాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించట్లేదు.