ఆ రూమర్లు నమ్మవద్దు... ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్దంగా ఉంది... మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు...
తెలంగాణలో కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా రోగులకు ఆక్సిజన్ కొరత లేదని చెప్పారు. ఆస్పత్రుల్లో పడకలు దొరకడం లేదన్న పుకార్లు నమ్మవద్దన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని... తగు జాగ్రత్తలు పాటిస్తే కరోనా బారినపడకుండా ఉండవచ్చునని చెప్పారు. మంగళవారం(ఏప్రిల్ 20) సూర్యాపేటలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడారు. రూ.17 కోట్ల వ్యయంతో 250 పడకలతో దీన్ని నిర్మించారు.
కొవిడ్ రోగుల్లో కేవలం 5 శాతం మందిలోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఈటల రాజేందర్ తెలిపారు. 99.5 శాతం మంది కోలుకుని డిశ్చార్జి అవుతున్నారని చెప్పారు.
95శాతం కరోనా పేషెంట్స్ ఆక్సిజన్,వెంటిలేటర్ అవసరం లేకుండానే కోలుకుంటున్నారని చెప్పారు.రాష్ట్రంలో ప్రతీ ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టెస్టు పరికరాలు అందుబాటులో ఉన్నాయని... ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొవిడ్ రోగులకు తెలంగాణ మెరుగైన సేవలందిస్తోందని వెల్లడించారు.ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తతో వ్యవహరిస్తోందని చెప్పారు.

కరోనా నేపథ్యంలో తెలంగాణలో నేటి(ఏప్రిల్ 20) రాత్రి నుంచి కర్ఫ్యూ విధించనున్న సంగతి తెలిసిందే. రాత్రి 9గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఏప్రిల్ 30 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, వ్యాపారాలు, బార్లు,రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూతపడనున్నాయి. కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్లు, మందుల దుకాణాలు,మీడియా,పెట్రోల్ బంకులు, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు, ఈ-కామర్స్ సర్వీసులు తెరిచే ఉంటాయి. అలాగే రాత్రిపూట ప్రయాణాలకు కూడా అనుమతి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక పాసులు ఏమి అవసరం లేదు. ఏప్రిల్ 30 తర్వాత అప్పటి పరిస్థితులను సమీక్షించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కాగా,ఆదివారం(ఏప్రిల్ 18) రాత్రి 8గం. నుంచి సోమవారం రాత్రి 8గం. వరకు 5926 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరో 18 మంది కరోనాతో మృతి చెందారు. మరో 6033 రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,359కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1856కి చేరింది. ప్రస్తుతం 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2209 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,16,650కి చేరింది.ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉండగా... తెలంగాణలో 0.51శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 85.6 శాతం ఉండగా తెలంగాణలో 87.62 శాతం ఉంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 793 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,19,42,985కరోనా టెస్టులు నిర్వహించారు.












Click it and Unblock the Notifications