ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు, ఆ కేసు విత్ డ్రా చేసుకోండి: కేసీఆర్
మంచిగా పనిచేస్తే ప్రజలే ఆశీర్వదిస్తారని, ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉందన్న ఆరోపణలను సీఎం కేసీఆర్ కొట్టివేశారు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్బంగా కేసీఆర్ ఈ అంశంపై స్పందించారు.
మంచిగా పనిచేస్తే ప్రజలే ఆశీర్వదిస్తారని, ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీలో ఎన్నికలు జరుగతాయని వెల్లడించారు. అనుకున్న లక్ష్యాలు సాధించి తీరుతామని, ఆటంకాలు కలిగించినా పురోభివృద్ధి వైపు వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.
తెలంగాణలో కాంట్రాక్టు సిబ్బంది ఉండకూడదనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని, దీనిపై కాంగ్రెస్ నాయకులు హైకోర్టు నుంచి తెచ్చిన స్టేను ఉపసంహరించుకోవాలని కేసీఆర్ కోరారు. త్వరలోనే అర్హత ఉన్న హోంగార్డులను రెగ్యులరైజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అతి తక్కువ వేతనాలతో సిబ్బంది పనిచేయించడం మంచిది కాదన్నారు.
ఇదే సమయంలో పోలవరం ముంపు గురించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ప్రస్తావించారు. ముంపులో లేని నాలుగు గ్రామాలను తిరిగి తెలంగాణలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఇదిరకే ఏపీ సీఎం చంద్రబాబుతో విషయంపై చర్చించామని, మరోసారి దీనిపై చర్చిస్తామని అన్నారు. ఆ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు కృషి చేస్తామని అన్నారు.
శాసనమండలిలో గవర్నర్ ప్రసంగంపై కేసీఆర్ ధన్యవాద తీర్మానం తర్వాత సభను స్వామిగౌడ్ గురువారానికి వాయిదా వేశారు.