కేసీఆర్ వర్సెస్ భట్టి: నియంతృత్వం కాదు బాధ్యత, సెల్ఫ్ సెర్టిఫైడ్తో ట్యాక్స్..
కరెంట్ చార్జీలతోపాటు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కూడా పన్నులు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గత 70 ఏళ్ల నుంచి ఉన్న విధానాల వల్ల లక్షలకు లక్షల పన్నులు పేరుకుపోయాయని చెప్పారు. దీంతో గ్రామాలు, పట్టణాల ప్రగతి పడకేసిందని వివరించారు. ఇదివరకు లాగా కాకుండా ఎవరికీ వారు సెల్ఫ్ సర్టిఫైట్ చేసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. దీంతో మున్సిపాలిటీ, గ్రామాల్లో జరిగే అవినీతిని రూపుమాపొచ్చని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. అంతకుముందు చార్జీల పెంపు, కొత్త పంచాయతీరాజ్ చట్టంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క-కేసీఆర్ మధ్య మాటలయుద్ధం జరిగింది.

ఎవరికీ వారు సర్టిఫై చేసుకొని..
తనకు ఇంత ఇల్లు ఉందని ఎవరికీ వారు ఆయా పంచాయతీ/మున్సిపాలిటీలో చెప్పాలని కోరారు. తమ ఇల్లుకు మొత్తం ఎంత అవుతుందో పన్ను కట్టాలని వివరించారు. ఇప్పటివరకు ఓకే.. కానీ వారు తప్పుగా ధృవీకరిస్తే అదేస్థాయిలో చర్యలు ఉంటాయని సభకు వివరించారు. తనిఖీ చేసే సమయంలో పన్ను తప్పుగా ఉంటే 20 వంతుల జరిమానా విధిస్తామని చెప్పారు. ఫైన్తో సరిపెట్టమని.. రెండేళ్ల జైలు శిక్ష కూడా వేస్తామన్నారు. ప్రజలకు కూడా జవాబుదారీతనం ఉండాలనే కొత్త పంచాయతీరాజ్ చట్టం కఠినంగా రూపొందించామని పేర్కొన్నారు.

రూ.లక్షకు రూ.20 లక్షల ఫైన్
హైదరాబాద్ మహానగరంలో రూ.లక్ష పన్ను అయితే 20 లక్షల జరిమానా కట్టాలని సీఎం కేసీఆర్ వివరించారు. దీంతో ప్రజలకు భయం ఉంటుందని.. తప్పులు చేసే అవకాశం ఉండదన్నారు. ఆయా పంచాయతీ/మున్సిపాలిటీకి పన్నులు జమవుతాయని అంచనా వేశారు. దీంతో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలకు నిధులు సమకూరుతాయని... వాటిని అభివృద్ధి చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.

అడిగేవారేరీ..?
ఇదివరకు కరెంట్ లైన్లు వేశారని.. అక్కడ ఇళ్లకు పర్మిషన్ ఇవ్వొద్దని.. కానీ అలా ఇవ్వడంతో సమస్య వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని కేసీఆర్ తేల్చిచెప్పారు. లే ఔట్ పర్మిషన్ జిల్లా కలెక్టర్కు ఇచ్చామని.. ధైర్యంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. తాము ప్రజాస్వామ్యాన్ని హరించలేదని, దుర్మార్గాన్ని మాత్రమే హరించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఉద్దేశించి కామెంట్ చేశారు. రాష్ట్రంలో డిక్టేటర్ షిప్ నడుస్తోందని భట్టి విక్రమార్క అనగా.. ఈ మేరకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు.

బాధ్యత.. నియంతృత్వం కాదు..
మున్సిపల్ కౌన్సిలర్, వార్డు సభ్యులకు బాధ్యతలు అప్పగించామని సీఎం కేసీఆర్ వివరించారు. ఆయా వార్డుల్లో సంబంధిత కౌన్సిలర్.. చెట్లను కాపాడే బాధ్యత అని, మంచినీరు రాకున్నా రెస్పాన్సిబులిటీ అని.. డ్రైనేజ్ తీయకున్నా, వీధి లైట్లు వెలగకున్నా బాధ్యుడి అని చెప్పారు. ప్రజల సమస్యలు తీర్చకుంటే అతనేందుకు కౌన్సిలర్ అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజలకు జవాబుదారీతనం ఉండాలని, ప్రశ్నించేందుకు కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చామని వివరించారు.
Recommended Video


మాటలు కాదు చేతలే..
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించలేదని కేసీఆర్ గుర్తుచేశారు. ఏకకాలంలో రూ.2 లక్షల వ్యవసాయ రుణం మాఫీ చేస్తామని చెప్పినా.. టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారని వివరించారు. తాము రూ. లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పినా... తమను ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు. అదీ కూడా విడతలవారీగా చేస్తామని చెప్పినా.. తమ పార్టీకే పట్టం కట్టారని వివరించారు.












Click it and Unblock the Notifications