నా ప్రభుత్వమే కాదు, మోడీ ప్రభుత్వం నల్లధనంపై నడిచింది: కేసీఆర్ సంచలనం
తన ప్రభుత్వమే కాదని, మోడీ ప్రభుత్వం కూడా నల్ల ధనం పైనే నడిచిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: తన ప్రభుత్వమే కాదని, మోడీ ప్రభుత్వం కూడా నల్ల ధనం పైనే నడిచిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన సాయంత్రం విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి తమ ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యల పైన స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం నల్ల డబ్బుతో నడుస్తోందా? అని కిషన్ రెడ్డి ఎలా ప్రశ్నిస్తారని నిలదీశారు. నా ప్రభుత్వమే కాదు, మోడీ ప్రభుత్వం కూడా అలాగే నడిచిందన్నారు.
మోడీకి సూచనలిచ్చా: గాలి కూతురు పెళ్లిపై కేసీఆర్
మోడీ నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు
నల్లధనం లేని, అవినీతి రహిత భారతదేశంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర మద్దతు ఉంటుందని తాను ఇప్పటికే కేంద్రానికి తెలిపినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ పెద్దనోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి వీల్లేదన్నారు. అది పెద్ద సంస్కరణ అన్నారు.
నగదు రహిత లావాదేవీలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పెద్దనోట్ల రద్దు అనంతరం పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ఏర్పాటు చేసిన ఉపసంఘాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. శీతాకాల, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రెండూ కలిపి డిసెంబర్లో నిర్వహిస్తామని ప్రకటించారు.
అయితే తేదీలను ఇంకా ఖరారు చేయలేదన్నారు. ఉద్యోగుల జీతాలు నగదురూపంలో చెల్లించే విషయంపై బ్యాంకర్లతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ నేతల చీకటి ఒప్పందం వ్యాఖ్యలపై భగ్గు
ఇటీవల ప్రధాని మోడీతో ఢిల్లీలో జరిగిన భేటీలో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ఎక్కువ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీయే నల్లధనాన్ని పెంచి పోషించిందని, దేశాన్ని సర్వనాశనం చేసిందన్నారు. నల్ల ధనం సృష్టికర్తలే వాళ్లు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు నల్లధనం గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.
సిద్దిపేటను మోడల్గా తీసుకుంటాం..
క్యాష్ లెస్ నియోజకవర్గంగా సిద్దిపేటను మోడల్గా తీసుకొని అమలు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు చెప్పారు. బ్యాంకర్లు సహకరిస్తే ఆరు నెలల్లో చేస్తామన్నారు. రూ.500 వరకే నగదుతో లావాదేవీలకు అవకాశం కల్పిస్తామన్నారు.
అక్కడ ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్తామన్నారు. ఇప్పటికే గుజరాత్లోని అకోదరలో ఈ విధానం నడుస్తోందన్నారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అనుసంధానం కోసం అధికారులను నియమిస్తున్నామన్నారు.
క్యాష్ లెస్ లావాదేవీలను పెంచేందుకు త్వరలోనే ఐటీ శాఖ ఆధ్వర్యంలో టీఎస్ వ్యాలెట్ను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి తీసుకొచ్చే ఈ వ్యాలెట్లపై విధించే ఎండీఆర్ ఎత్తివేయాలని ప్రధాని మోడీని కోరానన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం మనుగడ సాధించాలంటే మీడియా సహకారం తప్పనిసరన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధానితో భేటీలో సుమారు గంటపాటు మాట్లాడాననీ, నోట్లరద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, పరిష్కారాలను కేంద్రానికి నివేదించానన్నారు. బ్యాంకు ద్వారా పారదర్శక ద్రవ్య మారకం జరిగేందుకు కేంద్రం నిర్ణయించిందన్నారు.
'చంద్రబాబు సింప్లిసిటీ, కేసీఆర్ నేర్చుకోవచ్చు', ఏపీ సీఎంపై జగన్ విమర్శ ఇదే
దేశంలో 25 కోట్లు, రాష్ట్రంలో 82లక్షల జనధన్ ఖాతాలు ఉన్నాయని వివరించారు. మన దేశమంతా నగదుతో కూడిన ఆర్థిక వ్యవస్థ నడుస్తోందన్నారు. నోట్లరద్దు నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని, అందువల్ల దానిపై ఆధారపడి జీవించే వారి కోసం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ద్వారా ఉపాధి కల్పిస్తామన్నారు.
రాష్ట్రంలో వసూళ్లకు ఇబ్బంది లేకుండా బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిగేలా చూస్తామన్నారు. దేశంలో 140 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీల్లో నగదుతో జరిగేవి కేవలం 12శాతమేనన్నారు. రాష్ట్రంలో సమస్యల్ని అధిగమించేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. త్వరలో కలెక్టర్లతో సమావేశమై ప్రజల సమస్యలను చర్చిస్తామన్నారు.