నోట్ల రద్దు: ఎస్బీఐ తీపి కబురు, అరుంధతి హామీ
పెద్ద నోట్ల రద్దు గడువు ముగిసిన తర్వాత కూడా డిమాండుకు తగినట్లుగా కరెన్సీ అందుబాటులో రాకపోవడంతో ప్రజల కష్టాలు పూర్తిగా తీరలేదని చెప్పవచ్చు. గత వారం రోజులుగా డబ్బులు మాత్రం ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి
అహ్మదాబాద్: పెద్ద నోట్ల రద్దు గడువు ముగిసిన తర్వాత కూడా డిమాండుకు తగినట్లుగా కరెన్సీ అందుబాటులో రాకపోవడంతో ప్రజల కష్టాలు పూర్తిగా తీరలేదని చెప్పవచ్చు. గత వారం రోజులుగా డబ్బులు మాత్రం ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. కానీ పూర్తిగా మాత్రం కష్టాలు తీరలేదు.
ఏటీఎంలో రూ.2000 నోట్లు ఎక్కువగా వస్తుండటంతో చిల్లర సమస్య ఏర్పడింది. సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి మరో ఆరు నెలల సమయం పడుతుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య స్పందించారు.
ఫిబ్రవరి నెలఖరుకల్లా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తీపి కబురు చెప్పారు. ఫిబ్రవరి తొలివారం నుంచే పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటాయని, నెలాఖరు నాటికి పూర్తిగా సమసిపోతాయన్నారు.

నగదు కోసం క్యూలలో నిలబడే పరిస్థితి ఉండదని, దీనికి తాను హామీ ఇస్తున్నానన్నారు. బ్యాంకు బ్రాంచిలకు సరిపడా డబ్బులు పంపిస్తున్నామని, దీనివల్ల ఖాతాదారులు కావాల్సినంత సొమ్మును డ్రా చేసుకోవచ్చన్నారు.నోట్లు మళ్లీ చలామణిలోకి వస్తాయని, ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు అవసరం లేదన్నారు.
అలాగే, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే అంశంపై చర్చిస్తున్నామన్నారు. దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. కరెన్సీ అందుబాటులోకి వచ్చాక పెద్ద నోట్ల రద్దుకు ముందు మాదిరే బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications