చాప్టర్-15, నంబర్ 4లో ఏముంది? అమిత్ షా నిజం చెప్పండి: అసదుద్దీన్ ఫైర్
జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ)కి మొదటి అడుగు జాతీయ పౌర రిజిష్టర్ (ఎన్పీఆర్) అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఆర్ జాబితా సేకరించి, సెప్టెంబర్ చివరికల్లా, ఆ లిస్ట్ ఎన్ఆర్సీ అని ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఎన్పీఆర్ పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలను మోసం చేస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
పదేళ్లకోసారి..
ఎన్పీఆర్ సాధారణంగా పదేళ్లకోసారి నిర్వహిస్తారు. ఇందులో ఎలాంటి అనుమానం, అపోహ లేదు.. కానీ 1955 పౌరసత్వ చట్టం ప్రకారం జాతీయ పౌర పట్టిక నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని పార్లమెంట్లో అమిత్ షా పేర్కొన్నారు. అంతేకాదు సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో తాము అబద్దాలు ఆడబోమని బీరాలు పలికారని అసదుద్దీన్ గుర్తుచేశారు. కానీ జాతీయ పౌర పట్టిక ద్వారా వివరాలు సేకరించి, ధ్రువపత్రాలు తీసుకొని.. చివరికి ఎన్ఆర్సీ జాబితా అని చెప్తారని అసదుద్దీన్ స్పష్టంచేశారు.
నిజం చెప్పండి..
ఎన్పీఆర్ జాబితా చేపడుతామని మంగళవారం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాల నుంచి అనుమానాలు తలెత్తగా ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ వేర్వేరు అని అమిత్ షా మీడియాకు వివరించారు. దీనిపై అసదుద్దీన్ స్పందిస్తూ.. అమిత్ షా విద్యావంతుడు అని తనదైన శైలిలో విమర్శలు చేశారు.
చాప్టర్ 15 చూడండి..
కేంద్ర హోంశాఖ పరిధిలోని చాప్టర్ 15 వార్షిక నివేదిక 2018-19 చూడాలని సూచించారు. అందులో పాయింట్ నంబర్ 4 చదివితే అర్థమవుతోందని చెప్పారు. ఎన్పీఆర్ అంటే మరేమిటో కాదు ఎన్ఆర్సీకి తొలి అడుగు అని ప్రొవిజన్ ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో కూడా ఉందని తెలిపారు. అంతేకాదు ఎన్పీఆర్ గురించి 2014 నవంబర్ 26న అప్పటి కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని పేర్కొన్నారు.
కమిటీతో దర్యాప్తు
సీఏఏను నిరసిస్తూ ఆందోళన చేపట్టి పదుల సంఖ్యలో ఆసువులు బాశారని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. యూపీలో 18 మందిని పొట్టనపెట్టుకున్నది ఎవరు? దీనిపై స్వతంత్ర కమిటీతో ఎందుకు దర్యాప్తు జరిపించరు అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఉత్తర ప్రదేశ్లో 5400 మంది జైళ్లలోనే ఉన్నారనే విషయాన్ని గుర్తుచేశారు.