జయరాం హత్య, వీడిన మిస్టరీ.. కారణమిది!: ? ఆ తర్వాత ఇంటి వద్ద శిఖాచౌదరి హడావుడి?
హైదరాబాద్: ఎక్స్ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసును పోలీసులు చేధించారని తెలుస్తోంది. ఆయనను రాకేష్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారని సమాచారం. అదే సమయంలో ఈ హత్యకు శిఖా చౌదరికి సంబంధం ఉందా, లేదా? అనే కోణంలోను విచారిస్తున్నారు.
జయరాం కేసులో మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..! త్వరలో అరెస్టు..!!?
తెలంగాణలో హత్య చేసి ఏపీకి తీసుకెళ్లారు
ముందస్తు పథకంలో భాగంగానే నిందితులు... జయరాంను తెలంగాణ ప్రాంతంలో హత్య చేసి, ఏపీకి తీసుకెళ్లి పడేసినట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. జయరాంను నందిగామ వద్దకు తీసుకురాకముందే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. జయరాంను నిందితుడు కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకెళ్లి ఉంటారని అంటున్నారు. రాకేష్ రెడ్డి అనే వ్యక్తి వద్ద తీసుకున్న రూ.4.5 కోట్ల అప్పు హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది.
శిఖా చౌదరి విషయంలో అనేక అనుమానాలు
శిఖా చౌదరి విషయానికి వస్తే ఆమె తమ వద్ద లేదని పోలీసులు చెబుతున్నారని తెలుస్తోంది. శిఖ స్టేషన్లో లేకుంటే తల్లి అక్కడకు ఎందుకు వచ్చిందని అంటున్నారు. అలాగే శిఖా కోసం కబాలి ప్రొడ్యూసర్ ఎందుకు వచ్చారని అంటున్నారు. శిఖా కారును కబాలి నిర్మాత తీసుకెళ్లాడని చెబుతున్నారు. అసలు ఆయన ఎందుకు తీసుకు వెళ్లవలసి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
గత నెల 29న శిఖ ఇంటికి జయరాం
శిఖా చౌదరిని గచ్చిబౌలిలోని ఆమె నివాసం వద్ద పోలీసులు విచారించారని తెలుస్తోంది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే అంశంపై భిన్నరకాల వాదనలు వినిపిస్తున్నాయి. గత నెల 29న రాత్రి శిఖాచౌదరి ఇంటికి జయరాం వచ్చి వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. 31వ తేదీన రాత్రి 11 గంటలకు జయరాం ఇంటి నుంచి శిఖా చౌదరి వెళ్లినట్టుగా కూడా గుర్తించారని సమాచారం. శిఖాచౌదరి, ఆమె ప్రియుడు రాకేష్ ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తొలుత అనుమానించారు. అయితే ఇప్పుడు రాకేష్ మాత్రమే హత్య చేసినట్లుగా గుర్తించారని తెలుస్తోంది. శిఖా పాత్రపై ఇంకా అనుమానాలు వీడలేదు.
హత్య తర్వాత జయరాం ఇంటికి శిఖాచౌదరి
హత్య జరిగిన తర్వాత శిఖా చౌదరి... జయరాం ఇంటికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆమె అప్పుడు ఎందుకు వచ్చిందనే కోణంలోను విచారిస్తున్నారు. జయరాం ఇంటి వద్ద శిఖ హడావుడి చేసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. జయరాంను హత్య చేశాడని భావిస్తున్న రాకేష్ రెడ్డిని పోలీసులు విజయవాడ తీసుకెళ్లారు.
హైదరాబాదుకు రానున్న జయరాం భార్య, పిల్లలు
మరోవైపు, శిఖా చౌదరి, రాకేష్ ప్రేమించుకున్నారని, వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని, దీంతో డబ్బులు ఇస్తాం.. శిఖను వదిలేయాలని చెప్పారట. కానీ ఆ తర్వాత ప్రేమికులు ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో కూడా జయరాం హత్యకు గురయ్యారా అనే కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది. పోలీసులు జయరాం సోదరి, శిఖా చౌదరి, రాకేష్ రెడ్డి, జయరాం గన్మెన్లు, కారు డ్రైవర్లను పలు కోణాల్లో విచారించారు... విచారిస్తున్నారు. కాగా, జయరాం మృతదేహాన్ని శుక్రవారం పోస్టుమార్టంకు అప్పగించిన నందిగామ పోలీసులు.. అదేరోజు రాత్రి మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించారు. అమెరికాలో ఉన్న జయరాం భార్య పద్మశ్రీ, పిల్లలు ఆదివారం హైదరాబాద్ చేరుకుంటున్నారు. జయరాం భార్య, పిల్లలు వచ్చిన తర్వాతే అంత్యక్రియలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.