మాజీ క్రికెటర్ ను మోసం చేసిన ఎన్నారై డాక్టర్ అరెస్ట్..
హైదరాబాద్ : దాదాపు 40మంది వ్యక్తులను మోసం చేసిన కుసుమ విఠల్ అనే ఎన్నారై డాక్టర్ ను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నారై డాక్టర్ బాధితుల జాబితాలో మాజీ క్రికెటర్ వంక ప్రతాప్ కూడా ఉండడం గమనార్హం. మాజీ క్రికెటర్ వంక ప్రతాప్ తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన కుసుమ విఠల్.. ఫోర్జరీ సంతకాలతో ప్రతాప్ ను మోసం చేశాడు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ కుసుమ విఠల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్టర్ వంక ప్రతాప్ తో కలిసి చాలాకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగించాడు. ఇదే క్రమంలో ప్రతాప్ కు తెలియకుండా అతని సంతకాలను ఫోర్జరీ చేసి.. తప్పుడు ధ్రువ పత్రాలతో విలువైన భూములను అమ్మేశాడు.
దీంతో 2007లో అతనిపై కేసు నమోదవగా.. విచారణకు హాజరయ్యాడు. అనంతరం అమెరికాకు పారిపోయి అక్కడే ఉంటున్నాడు. పలుమార్లు కోర్టు నోటీసులు పంపించినా.. అతని నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది కోర్టు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు విఠల్ హైదరాబాద్ లో అడుగుపెట్టడంతో.. శామీర్ పేట పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.