'శిఖా చౌదరి హైఫైలైఫ్, పేదమ్మాయి బీఎండబ్ల్యులో తిరిగేస్థాయికి ఎలా ఎదిగింది?'
హైదరాబాద్: తన భర్త హత్యకు శిఖా చౌదరి ప్లాన్ చేసి ఉంటుందని జయరాం సతీమణి పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆమె రోల్ లేకుంటే తన భర్త చనిపోయేవాడు కాదని చెప్పారు. మామ జయరాం చనిపోయాడని తెలిసి కోడలు శిఖా వెంటనే నందిగామ ఎందుకు వెళ్లలేదని అడిగారు. తన ఇంటికి వచ్చి పత్రాలు ఎందుకు తీసుకు వెళ్లిందన్నారు. జగ్గయ్యపేటలో ఆమె పేరున భూమి ఉందనే మాటలు వాస్తవం కాదన్నారు.
జయరాం హత్య: 'శిఖా చౌదరి ఆస్తిపై కన్నేసిందా, ఏపీ పోలీసుల్ని ప్రభావితం చేసిందా?'
శిఖతో ముప్పు ఉందని అప్పుడే భయపడ్డా
అయిదేళ్ల క్రితమే శిఖా చౌదరి వ్యవహారం చూసి జయరాంకు ముప్పు ఉందని తాను భయపడ్డానని పద్మశ్రీ చెప్పారు. శిఖాచౌదరికి చెక్ పవర్ ఉండేదని చెప్పారు. తన భర్త జయరాంకు రాకేష్ రెడ్డి రూ.4.5 కోట్లు ఇచ్చారనే వార్తలో వాస్తవం లేదని చెప్పారు. తాను అమెరికాలో ఎక్కువగా ఉండటం తమ దురదృష్టమని చెప్పారు. ఆ సమయంలో చాలా అవకతవకలు జరిగాయన్నారు.
పేద అమ్మాయి శిఖా బీఎండబ్ల్యులో తిరిగేస్థాయికి ఎలా ఎదిగింది?
అసలు రాకేష్ రెడ్డి ఎవరో తనకు తెలియదని పద్మశ్రీ చెప్పారు. గతం అంతా మరిచిపోయి సంతోషంగా ఉందామని జయరాం చెప్పేవాడని చెప్పారు. పేద అమ్మాయి అయిన శిఖాచౌదరి బీఎండబ్ల్యు కారులో తిరిగే స్థాయికి ఎలా ఎదిగిందని ప్రశ్నించారు. డబ్బు కోసం శిఖా దేనికైనా తెగిస్తుందని, ఆమె పూర్తిగా డబ్బు మనిషి అన్నారు.
శిఖా హైఫై లైఫ్కు అలవాటుపడింది
తొలుత ప్రమాదానికి గురయ్యాడని ఆ తర్వాత, అమెరికాలో ఉన్నప్పుడే చనిపోయాడని తెలిసిందని పద్మశ్రీ అన్నారు. కానీ ఇక్కడకు వచ్చాకే హత్య అనే విషయం తెలిసిందని అన్నారు. ఎంత బిజీగా ఉన్న తన ఫోన్కు వెంటనే స్పందించేవారని, కానీ ఆ తర్వాత క్రమంగా తన ఫోన్కు స్పందించలేదని చెప్పారు. హత్యకు ప్లాన్ ఒకరు చేస్తే, మరొకరు అమలు చేశారని చెప్పారు. కాబట్టి ఇద్దరిని శిక్షించాలన్నారు. శిఖా చౌదరి ప్లాన్ చేసి ఉంటుందని అనుమానిస్తున్నానని చెప్పారు. శిఖ ఇన్నోసెంట్ అంటే నేను నమ్మనని చెప్పారు. ఇలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదన్నారు. ఆమె హైఫై లైఫ్ కోసం అలవాటు పడిందన్నారు. తన భర్త జయరాం హ్యుమనైజర్ అని ఆరోపణలు చేస్తున్నారని, కానీ కాదని చెప్పారు.
ఆస్తులు లాక్కునేందుకు
తమ ఆస్తులు లాక్కునేందుకు శిఖా చౌదరి.. రాకేష్ రెడ్డితో కలిసి చంపిసిందని పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేశారు. తన భర్తకు మహిళలతోసంబంధం ఉందని చెబితే బాధగా ఉందన్నారు. జయరాం అంతిమ సంస్కారాలకు ఆయన దగ్గరి కుటుంబ సభ్యులు కూడా రాలేదని చెప్పారు. శిఖా చౌదరి పాత్ర ఉందని తనకు అనుమానం ఉందని, ఆమె రోల్ లేదని పోలీసులు చెప్పడం గురించి తనకు సంబంధం లేదని అభిప్రాయపడ్డారు.