ఎన్టీఆర్ కు నిజమైన రాజకీయ వారసుడు సీఎం కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి సంచలనం!!
తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ విదేశాలలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా టీడీపీ ని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో సమూలమైన మార్పులు చేసిన, ఎన్నో సంస్కరణలు తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్. నేడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా పలువురు సినీరంగ, రాజకీయరంగ ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద శక పురుషుడు ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హనుమకొండలో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నివాళులర్పించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హనుమకొండ లోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విశ్వవిఖ్యాత నటుడిగా. పరిపాలనాదక్షుడుగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారని, పేదలకు ఇళ్లు ఇచ్చారని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్ టి ఆర్ కే దక్కుతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిన నేత ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ గారికి నిజమైన రాజకీయ పరిపాలన వారసుడు సీఎం కేసీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎన్టీఆర్ ఆశయాలను సీఎం కేసీఆర్ మాత్రమే పాటిస్తున్నారన్నారు.

సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఎన్టీఆర్ తరహాలో అభివృద్ధి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో కూడా అనేకమార్లు మంత్రి ఎర్రబెల్లి తనకు రాజకీయాల్లో ఎన్టీఆర్, కేసీఆర్ ఇద్దరే నచ్చిన వ్యక్తులని అనేకమార్లు వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications