నయీమ్ గ్యాంగులో నెంబర్ 2 సలీమా: అసలు సూత్రధారి శేషన్న?
హైదరాబాద్: నయీం హత్య తర్వాత అతని నేర సామ్రాజ్యం అంతమవుతుందా, కొనసాగుతుందా అనే విషయంపై చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు దర్యాప్తు అధికారులు 18 మందిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో కీలకమైన వాళ్లు ఉన్నారు. అయితే, అసలు సూత్రధారిగా భావిస్తున్న శేషన్న కోసం పోలీసులు జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. నయీంకు అత్యంత సన్నిహితులైన బాలన్న, శేషన్న అత్యంత కీలకమైనవారని భావిస్తున్నారు.
వారిద్దరు కూడా మాజీ నక్సలైట్లగా తెలుస్తోంది. అయితే, నయీం సోదరి సలీమా అతని గ్యాంగులో నెంబర్ టూ అని చెబుతారు. ఆమె పేరు మీద ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. గతంలో నెంబర్ టూగా ప్రకటించుకున్న ఆసిన్ను నయీం హత్య చేసినట్లు కూడా చెబుున్నారు.
నయీం కేసులో ఇప్పటి వరకు పోలీసులు 18 మందిని అరెస్టు చేశారు. వారిలో హసీనా, శ్రీధర్ గౌడ్, అప్స, రియాజ్, సలీమా బేగం, పున్నా బలరాం, మతీన్, తాజుద్దీన్, ఖలీమా ఉన్నారు. కాగా, సిహెచ్ సుదాకర్, రేపటి వేంకటేష్, రేపటి కరుణాకర్, సాజిదా, గద్దం శామ్యూల్, ఫియాజ్, దొమ్మల శీను, శ్రీధర్ రాజు పరీరాలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, నయీం బెడ్రూంలో పలు కీలకమైన సాక్ష్యాధారాలు బయటపడినట్లు తెలుస్తోంది. రాజకీయ నేతలు, పోలీసు అధికారుల ఫొటోలు కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. వీడియోలు కూడా లభించినట్లు తెలుస్తోంది. నయీం సహకారంతో ఓ మాజీ పోలీసు అధికారి భువనగిరి వద్ద వంద ఎకరాలకు పైగా భూములు కొన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఇటీవల అధికార పార్టీలో చేరిన ఓ నేతతో నయీంకు సంబంధాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఓ మండలి సభ్యుడితోనూ అతనికి సంబంధాలున్నట్లు చెబుతున్నారు. నయీం మాజీ సైనికుల భూములను కబ్జా చేసి ప్లాట్లుగా అమ్ముకున్నట్లు గుర్తించారు. దీనిపై మాజీ సైనికులు కోర్టులో కేసు వేశారు.
నల్లగొండ జిల్లాలోని పది ఎస్సైలతో నయీంకు సన్నిహిత సంబంధాలున్నాయని అంటున్నారు. వారు ఇప్పుడు సిఐలుగాను, డిఎస్పీలుగాను ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాదులోని చిక్కడపల్లిలో గల ఓ హోటల్ యజమానికి కూడా నయీంతో సంబంధాలున్నట్లు చెబుతున్నారు.