ఎనుమాముల మార్కెట్లో అధికారులు వర్సెస్ వ్యాపారులు.. ఆందోళనలో రైతన్నలు; రంగంలోకి మంత్రి ఎర్రబెల్లి!!
ఆరుగాలం శ్రమించినా అన్నదాతల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను తట్టుకుని పంటలు పండించి వ్యవసాయ మార్కెట్ కు తీసుకు వస్తే, మార్కెట్లో అనేక సమస్యలు అన్నదాతలకు స్వాగతం పలుకుతున్నాయి. అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యాపారుల మొండివైఖరి వెరసి రైతులకు నష్టం జరుగుతుంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో ఇక తాజాగా గన్నీ బ్యాగుల విషయంలో చోటుచేసుకున్న వివాదం మార్కెట్ కు వచ్చిన రైతులకు దిక్కుతోచని పరిస్థితిని కల్పిస్తోంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో గన్ని బ్యాగులకు ధర చెల్లింపు విషయంపై అధికారులు, వ్యాపారుల మధ్య వివాదం చోటు చేసుకుంది. వరంగల్ మార్కెట్ కు తీసుకు వచ్చే ప్రతి గన్ని బ్యాగ్ కు 30 రూపాయలు చెల్లించాలని అడిషనల్ కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. గన్ని బ్యాగ్ కు 30 రూపాయల చొప్పున రైతుకు చెల్లించాలన్న అంశంపై వారు తమ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గన్ని బ్యాగులు డబ్బులు చెల్లింపు విషయంపై మొండి వైఖరితో ఉన్న వ్యాపారులు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారు.
ఇక వ్యాపారులకు చాంబర్ ఆఫ్ కామర్స్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. వ్యాపారులకు అధికారులకు మధ్య చోటు చేసుకున్న వివాదంతో ఈరోజు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు, మార్కెట్ కార్యదర్శి రాహుల్ సెలవు ప్రకటించారు. అయితే ఈ విషయం తెలియక మార్కెట్ కు పత్తి, మిర్చి తీసుకు వచ్చిన రైతులు కొనుగోళ్ళు జరగకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అధికారులకు, వ్యాపారులకు మధ్య చోటు చేసుకున్న ఈ వివాదం నేపథ్యంలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రైతులు అరిగోస పడుతున్నారు.
ఇక ఈ క్రమంలో ఈ వివాదాన్ని పరిష్కరించడానికి నేడు సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇరు వర్గాలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. అధికారులు వ్యాపారులతో సమన్వయం చేయడానికి చొరవ తీసుకున్న మంత్రి సాయంత్రం ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టి, మార్కెట్లో యధావిధిగా వ్యాపార లావాదేవీలు కొనసాగేలా చూడడానికి ప్రయత్నం చేయనున్నారు. అధికారులు చెప్పిన గన్ని బ్యాగులకు ధర చెల్లించాలన్న అంశంతో వ్యాపారులు ఏకీభవిస్తారా? లేదా వ్యాపారుల డిమాండ్లకు అధికారులు తలొగ్గుతారా అన్నది నేడు తేలనుంది. మంత్రి ఈ వివాదంలో ఏం చెయ్యబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది.