పొగరాయుళ్లారా పారా హుషార్: ఇక హైదరాబాద్లో రోడ్డుపై పొగ తాగితే అంతే... కేసులు, కౌన్సెలింగ్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 'ధూమపాన రహిత' నగరంగా మారనుంది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై కఠినంగా వ్యవహరించడంతోపాటు అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవారమిక్కడ హైదరాబాద్ పోలీసులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యాచరణను ప్రకటించాయి. తొలుత పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31 నుంచి అక్టోబరు 1 వరకూ హైదరాబాద్లోని బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు, ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో ధూమపానం చేసేవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు ప్రజారోగ్య శాఖ, జీహెచ్ఎంసీ, పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.

ధూమపాన రహిత హైదరాబాద్..! బహిరంగ ప్రదేశాల్లో పొగతాగకుండా చర్యలు..!!
ఈ చర్యల అనంతరం అక్టోబరు 2న జరిగే గాంధీ జయంతి రోజు హైదరాబాద్ను ‘ధూమపాన రహిత' నగరంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించనున్నారు. ఆ తర్వాత కూడా చర్యలు కొనసాగుతాయి. ఈ అంశంపై సోమవారం జరిగిన సమావేశంలో కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ సాంకేతిక సలహాదారు గోవింద్ కె. త్రిపాఠి, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎలా అమలు చేయాలి? ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశాలను ఎఏస్సై, ఎస్సైలకు ఉన్నతాధికారులు వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగుతున్న వారిపై కేసులు ఎలా నమోదు చేయాలి? ఎలా హెచ్చరించాలి? అన్న అంశాలపై వీరికి రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు.కార్యాచరణలో భాగంగా ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై ఉన్న నిషేధాన్ని సమర్థంగా అమలు చేయనున్నారు.

అక్టోబరులో అంతర్జాతీయ ఊపిరితిత్తుల ఆరోగ్య సదస్సు..! హాజరు కానున్న సీఎం..!!
ఊపిరితిత్తుల సంరక్షణ, ఆరోగ్యంపై హైదరాబాద్లో అక్టోబరు 29 నుంచి నవంబరు 2 వరకూ అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఒక నగరంలో ఈ సదస్సు జరుగుతోందని.. తొలిసారిగా భారత్ నుంచి హైదరాబాద్ నగరం సదస్సు నిర్వహణకు ఎంపికైందని త్రిపాఠి తెలిపారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.

మద్యం తాగలేదు, సిగరెట్ కాల్చలేదు..! స్పూర్తిదాయక సందేశ మిచ్చిన కమీషనర్..!!
యువకుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ నా జీవితంలో ఒక్కసారి కూడా మద్యం తాగలేదు, సిగరెట్ కాల్చలేదు. ఆరోగ్యానికి హాని చేసే పొగాకు, మద్యంతో స్నేహం ఎందుకు చేయాలని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ధూమపానం చాలా ప్రమాదకరమని నా తోటి అధికారులు, సిబ్బందికి చెబుతుంటా. ప్రపంచంలో చైనా తర్వాత పొగాకు, దాని ఉత్పత్తులు వినియోగిస్తున్న దేశం మనదే. ధూమపానం కారణంగా ఏటా 8 లక్షల నుంచి 9 లక్షల మంది చనిపోతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.

ప్రకటనల ద్వారా సందేశం..! మంచి ఫలితాలు ఇస్తాయన్న ప్రజారోగ్య సంచాలకులు..!!
సినిమా థియేటర్లలో తొలుత ప్రదర్శిస్తున్న పొగాకు వ్యతిరేక ప్రకటనల్లో చికిత్స కోసం ‘రెండు గాజులు అమ్ముకున్నారు' అన్న మాటలు నిజమే. పొగాకుతో క్యాన్సర్ బారిన పడుతున్నవారందరూ చికిత్స కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. కొందరు ఈ-సిగరెట్స్ వినియోగిస్తున్నారు. ఇవి కూడా ఆరోగ్యానికి హాని చేస్తాయి. పోలీసులతో కలిసి మా శాఖ అధికారులు ధూమపాన వ్యతిరేక కార్యచరణలో పాల్గొంటారని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు.












Click it and Unblock the Notifications