Omicron effect: హైదరాబాద్లో సండే ఫన్ డే రద్దు, జాగ్రత్త అంటూ అధికారులు
హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. భారత్ కూడా అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను పొడిగించింది. కరోనా ఆంక్షలను కూడా పొడిగించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్లో సండే ఫన్ డే రద్దు
మాస్కులు ధరించకుంటే రూ. 1000 జరిమానా విధించనున్నట్లు ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అంతేగాక, కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించింది. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రతి ఆదివారం సండే ఫన్ డే పేరిట ట్యాంక్ బండ్, చార్మినార్ వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమాలను తాజాగా రద్దు చేసింది.
కరోనా కొత్త వేరియంట్ ప్రభావంతోనే ఫన్ డే రద్దు, జాగ్రత్తలు
డిసెంబర్ 5న నిర్వహించాల్సిన సండే ఫన్ డేను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా గుమిగూడకుండా ఉండాలని సూచించారు.
ఓమిక్రాన్ వేరియంట్ చాలా ప్రమాదకరమైందని.. దీని పట్ల జాగ్రత్త గా ఉండాలని హెచ్చరించారు. ఫన్ డే కార్యక్రమంలో లేనందున వాహనదారులు యధావిధిగా తమ ప్రయాణాలను కొనసాగించుకోవచ్చన్నారు.
కటిన ఆంక్షల దిశగా తెలంగాణ సర్కారు
మరోవైపు, తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. మాస్కు లేకుంటే రూ. 1000 జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. వ్యాక్సిన్లు ప్రాణాలను రక్షిస్తాయి.. ప్రజల చెంతకు వ్యాక్సిన్లు వస్తున్నాయి... సద్వినియోగం చేసుకోవాలని సూచించారు శ్రీనివాసరావు. 5.90 లక్షల మంది హైదరాబాద్లో, 4.80 లక్షల మంది మేడ్చల్లో, 4.10 లక్షల మంది రంగారెడ్డిలో రెండో డోస్ వేసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల మంది రెండో డోస్ తీసుకోవాల్సి ఉందని.. వీరంతా వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
వ్యాక్సిన్ రక్ష.. మాస్క్ రక్షణ కవచం
సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారని గుర్తుశారు డీహెచ్ శ్రీనివాసరావు. ఇక, వ్యాక్సిన్ తర్వాత అత్యంత రక్షణ కవచం మాస్క్ అని, మాస్క్ ఖచ్చితంగా ధరించాలని సూచించారు. మాస్క్ ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా వేయాలని పోలీసులకు సూచించామని తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్కులు ఖచ్చితంగా ధరించాలన్నారు. వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే.. వ్యాక్సిన్ పై ఖచ్చితమైన నిబంధనలు ప్రభుత్వ అనుమతితో రూపొందించబోతున్నామని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.