పవన్ కల్యాణ్ పర్యటనలో అపశృతి- అభిమాని దుర్మరణం: ముగ్గురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణలో నిర్వహించిన పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బైక్స్ పై ఆయన కాన్వాయ్ ను ఫాలో అవుతూ వచ్చిన యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కొండగట్టు ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం ధర్మపురి మీదుగా హైదరాబాద్ కు తిరిగి వస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆ సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులు కొందరు ఆయన కాన్వాయ్ ను ఫాలో అయ్యారు. జనసేన జెండాలను తమ వాహనాలకు తగిలించుకుని పవన్ కల్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ వెంటే ప్రయాణించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మీదుగా కాన్వాయ్ వెళ్తోన్న సమయంలో కిషన్ రావు పేట్ బైక్స్ అదుపు తప్పి ఢీ కొట్టాయి. దీనితో నలుగురు యువకులు కింద పడ్డారు. వేగంగా వెళ్తోన్న బైక్స్ మీద నుంచి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో ఓ యువకుడి తలకు తీవ్ర గాయం కావడంతో దుర్మరణం పాలయ్యాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. వారికి ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది.
ఈ ఉదయం హైదరాబాద్ నుంచి పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లారు. అక్కడి ఆంజనేయ స్వామివారి గుడిలో వారాహి వాహనానికి పూజలు చేయించారు. అనంతరం ధర్మపురిలో గల లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి వెళ్లారు. సాయంత్రం హైదరాబాద్ తిరిగి వచ్చారు. తన పర్యటనలో చోటు చేసుకున్న ప్రమాదం పట్ల పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు.