హైదరాబాద్లో ఉగ్ర మూకల కలకలం: పరారీలో ఉన్న సల్మాన్ అరెస్ట్
హైదరాబాద్: నగరంలో కలకలం సృష్టించిన ఉగ్ర మూకల కదలికల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పరారీలో ఉన్న మరో వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. జవహర్ నగర్ పరిధి బాలాజీ నగర్కు చెందిన మహమ్మద్ సల్మాన్ను అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు మంగళవారం హైదరాబాద్లో ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరొకరి అరెస్టుతో మొత్తం అరెస్టైన వారి సంఖ్య ఆరుగురికి చేరింది.
అత్యంత క్రూరమైన ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉత్ తహరీర్(H-U-T)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేసి స్థానిక న్యాయస్థానంలో హాజరుపర్చి భోపాల్కు తరలించారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు ఏటీఎస్ పోలీసులు భోపాల్, హైదరాబాద్లలో ఏకకాలంలో దాడులు చేసి మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. నగరంలో అరెస్టైనవారిలో ఒకరు ప్రముఖ మెడికల్ కాలేజీలో హెచ్ఓడీగా, మరొకరు క్లౌడ్ సర్వీస్ ఇంజినీర్గా పనిచేస్తుండటం గమనార్హం.

ఏటీఎస్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన ఐదుగురిలో ముగ్గురు మారు పేర్ల(హిందువుల పేర్లతో)తో నివసిస్తున్నారు. ఇందులో భోపాల్కు చెందిన మహ్మద్ సలీం, ఒడిశాకు చెందిన అబ్దుర్ రెహ్మాన్లు ఐదేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. యువతను ఉగ్రవాదంపైపు ఆకర్షించేందుకు పలు దఫాలుగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు.. వీటికి భోపాల్ నుంచి కూడా ఇతర సభ్యులు హాజరైనట్లు సమాచారం.
పేలుడు పదార్థాల తయారీ, ఆయుధాల వినియోగంలోనూ వీరు శిక్షణ పొందారని.. తమకు ఆదేశాలు అందిన వెంటనే విధ్వంసానికి పాల్పడేలా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థ కదలికలపై చాలా రోజులుగా నిఘా పెట్టిన భోపాల్ పోలీసులు నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చారు. తెలంగాణకు చెందిన కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం, టాస్క్స్ ఫోర్స్ సిబ్బంది సాయంతో అనుమానితులను గమనించారు. భోపాల్, హైదరాబాద్లలో ఒకేసారి దాడి చేసి మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. ఉగ్ర కదలికల నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.












Click it and Unblock the Notifications