తెలంగాణకు బిగ్ రిలీఫ్.. కొత్తగా కేవలం రెండే పాజిటివ్ కేసులు...
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ రెండూ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1003కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 332 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 25 మంది మృతి చెందారు. సోమవారం 16 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రలో ప్రస్తుతం 646 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.ఏప్రిల్ 28 నాటికి రాష్ట్రంలోని 21 జిల్లాలు కరోనా ఫ్రీగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 97శాతం మంది కోలుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలంగాణలోని 12 జిల్లాల్లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదు. ఏప్రిల్ 28 నాటికి మరో 11 జిల్లాలు కరోనా ఫ్రీగా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.కంటైన్మెంట్లలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండటం,లాక్ డౌన్ ఆంక్షలను పకడ్బందీగా అమలుచేస్తుండటంతోనే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత మూడు,నాలుగు రోజులుగా రాష్ట్రంలో స్వల్ప సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శనివారం 7, ఆదివారం 11 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే సోమవారం మాత్రం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గి కేవలం 2 కేసులే నమోదవడం ఊరట కలిగించే విషయం.